IPL 2020: క్యాపిటల్స్ vs కింగ్స్ - పేస్ ఆయుధంతో ఢిల్లీ - హిట్టర్లపైనే పంజాబ్ ఆశలు - సండే బిగ్ ఫైట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ తొలి మ్యాచ్ లోనే పటిష్టమైన ముంబై జట్టును ఓడంచడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ పదును ఏమాత్రం తగ్గలేదని కెప్టెన్ ధోనీ నిరూపించుకున్నాడు. మలిపోరులో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. సండే బిగ్ ఫైట్ గా అభివర్ణిస్తోన్న ఈ మ్యాచ్.. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి ప్రారంభం కానుంది. రెండు జట్ల బలాబలాలను పరిశీలిస్తే..
ముగ్గురు పేసర్లతో ఢిల్లీ?
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, సందీప్ లామిచెన్, అక్షర్ పటేల్ లతో స్పిన్ స్క్వాడ్ బలంగానే ఉంది. అయితే, దుబాయ్ స్టేడియం పిచ్, అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆదివారం నాటి మ్యాచ్ లో పేస్ ఆయుధంతోనే బరిలోకి దిగాలని ఢిల్లీ భావిస్తోంది. తుది జట్టులో ముగ్గురు ప్రధాన పేసర్లకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇషాంత్ శర్మ, కలిసో రబడాలకు తోడు అన్రిచ్ నోర్జే పేస్ భారాన్ని పంచుకోనున్నాడు. స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో పేసస్ అన్రిచ్ ఫైనల్ 11లో ఉంటాడని తెలుస్తోంది.
ఏ ఇద్దరు ఫామ్ లోకి వచ్చినా..
ఐపీఎల్ సీజన్ రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ లెవన్ తో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుండగా.. బ్యాటింగ్ కు సంబంధించి కూడా స్పష్టమైన గేమ్ ప్లాన్ రూపొందించుకుంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. అంజిక్య రహానే, పృథ్వీ షా, వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఓపెనర్ శిఖర్ ధావన్ తదితర ఆటగాళ్లలో ఏ ఇద్దరు ఫామ్ లోకి వచ్చినా భారీ స్కోరు సాధించడం ఈజీ అవుతుందని భావిస్తోంది. ధవన్ గత సీజన్ లో భారీగా పరుగులు సాధించడం తెలిసిందే.
బ్యాటింగ్ బల్లే బల్లే..
పేస్ బౌలింగ్ పరంగా ఢిల్లీతో పోల్చుకుంటే కింగ్స్ లెవన్ పంజాబ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. పేస్ భారమంతా ఇద్దరు బౌలర్లపైనే మొహ్మద్ షమీ, రవి బిష్ణోయి ఉంది. స్పిన్నర్లు ముజీబ్ రెహమాన్, కృష్ణప్ప గౌతమ్ రాణిస్తే తప్ప మెరుగైన ఫలితాలు రాబట్టలేని పరిస్థితి. బౌలింగ్ లో అటు ఇటుగా ఉన్నా.. బ్యాటింగ్ విభాగంలో మాత్రం పంజాబ్.. ఢిల్లీకంటే బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ గతేడాదిలాగే అత్యుత్తమ ఫామ్ ను కనబరిస్తే కింగ్స్ కు ఢోకా ఉండదు. మ్యాక్స్ వెల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ గేట్ తో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
కుంబ్లే వర్సెస్ పాంటింగ్
ఆదివారం దుబాయిలో జరుగనున్న ఢిల్లీ కేపిటల్ వర్సెస్ కింగ్స్ లెవెన్ పంజాబ్ మ్యాచ్ ను ‘కుంబ్లే వర్సెస్ పాంటింగ్'గానూ క్రీడాభిమానులు అభివర్ణిస్తున్నారు. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తుండగా.. భారత లెజెండ్ అనిల్ కుంబ్లే అన్నీ తానై పంజాబ్ ను నడిపిస్తున్నారు. మొత్తంగా పలు అంశాల ప్రాతిపతికన సండే బిగ్ ఫైట్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.