IPL 2020: చితగొట్టిన ధవన్.. సన్రైజర్స్ ముందు భారీ లక్ష్యం
అబుదాబి: సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసి.. సన్రైజర్స్ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ (78: 50 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) అర్ధ శతకం సాధించాడు. 2020 సీజన్లో ధావన్కిది ఆరో హాఫ్సెంచరీ కావడం విశేషం. మరో ఓపెనర్ మార్కస్ స్టోయినిస్ (38: 27 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్), షిమ్రాన్ హెట్మెయర్ (42: 22 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్) రాణించారు. సన్రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఇప్పటివరకు ఆకట్టుకున్న హోల్డర్ ఈ మ్యాచులో 50 పరుగులు ఇచ్చుకున్నాడు.
ఓపెనర్లు ధావన్, స్టోయినీస్ ఇద్దరూ తొలి రెండు ఓవర్లను ఆచితూచి ఆడారు. స్టోయినీస్ 3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సందీప్ శర్మ వేసిన మూడో ఓవర్లో స్టోయినీస్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను మిడాన్లో హోల్డర్ వదిలేశాడు. అదే ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది ఇన్నింగ్స్కు ఊపుతీసుకొచ్చాడు. హోల్డర్ వేసిన నాలుగో ఓవర్లో స్టోయినీస్ మూడు ఫోర్లు, సిక్సర్ కొట్టి 18 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
సందీప్ శర్మ వేసిన తర్వాతి ఓవర్లో ధావన్ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో ఐదో ఓవర్లోనే ఢిల్లీ స్కోరు 50 మార్క్ దాటింది. శాబాజ్ నదీమ్ వేసిన ఆరో ఓవర్లో ధావన్ ఫోర్, సిక్సర్ కొట్టడంతో పవర్ప్లే ఆఖరికి ఢిల్లీ 65/0తో పటిష్ఠస్థితిలో నిలిచింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా భారీగానే పరుగులు ఇచ్చుకోవడంతో ఢిల్లీ స్కోర్ బోర్డు వేగంగా ముందుకు కదిలింది. తొలి వికెట్కు ఓపెనింగ్ జోడీ 86 పరుగులు జోడించింది. అయితే 9వ ఓవర్ రెండో బంతికి స్టోయినీస్ వికెట్ తీసిన రషీద్.. సన్రైజర్స్ జట్టులో కాస్త సంతోషం తీసుకొచ్చాడు.
ఆ తర్వాతి ఓవర్లో ధావన్ సిక్స్ బాది హాఫ్ సెంచరీ చేశాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇదే సమయంలో సన్రైజర్స్ బౌలర్లు కాస్త పుంజుకోవడంతో ఢిల్లీ బ్యాట్స్మన్ ఎక్కువగా బౌండరీలు బాధలేకపోయారు. దీంతో ఢిల్లీ స్కోర్ వేగం తగ్గింది. ధాటిగా ఆడే క్రమంలో 14వ ఓవర్ చివరి బంతికి అయ్యర్ (21) అవుట్ అయ్యాడు. వికెట్ పడినా కూడా ధావన్ వేగంగానే ఆడాడు. అనంతరం ధావన్కు హెట్మెయిర్ జతకలిసి ఇన్నింగ్స్లో మరొకసారి దూకుడు పెంచాడు. ఈ జోడి 30 బంతుల్లో 52 పరుగులు చేసింది. సందీప్ శర్మ వేసిన 19 ఓవర్ మూడో బంతికి ధావన్ ఔట్ అయ్యాడు. ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
ఆరంభంలో ధారళంగా పరుగులు ఇచ్చిన సన్రైజర్స్ బౌలర్లు ఆఖర్లో ఢిల్లీని కట్టడి చేశారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ (1/30), రషీద్ (1/26) కట్టుదిట్టంగా బంతులేస్తూ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టారు. 4 ఓవర్లు వేసిన హోల్డర్ వికెట్ తీసి 50 పరుగులు సమర్పించుకోగా.. 4 ఓవర్లు వేసిన నదీమ్ 48 పరుగులు ఇచ్చుకున్నాడు. కీలక మ్యాచ్లో సన్రైజర్స్ ఫీల్డర్లు చాలా క్యాచ్లను జారవిడిచారు.