ఆస్ట్రేలియా పిచ్లపై ఎలా బౌలింగ్ చేయాలో వరుణ్ చక్రవర్తికి ధోనీ టిప్స్
దుబాయ్: వరుణ్ చక్రవర్తి.. భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన యువ ఆటగాడు. త్వరలో భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా విమానం ఎక్కబోతున్నాడు. టీ20 మ్యాచ్లల్లో బలమైన ఆస్ట్రేలియా జట్టుతో ఆడబోతున్నాడు. డిసెంబర్ 4, 6, 8 తేదీల్లో టీమిండియా టీ20 మ్యాచుల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ల కోసం వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యాడు. ఇదే అతనికి తొలి ఇంటర్నేషనల్ సిరీస్. పైగా ఆస్ట్రేలియా వంటి వరల్డ్ క్లాస్ టీమ్తో ఆడటమంటే కొద్దో, గొప్పో బెరుకు ఉంటుంది.
అందుకే- టీమిండియా మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీని కలిసి కొన్ని మెళకువలను నేర్చుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం రాత్రి కోల్కత నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం వరుణ్ చక్రవర్తి.. ధోనీని కలిశాడు. జాతీయ జట్టుకు ఎంపికైనందుకు ధోనీ అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం వారిద్దరు కొద్దిసేపు డగౌట్లోనే మాట్లాడటం కనిపించింది.
ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై ఒక్కసారి రాణించగలిగితే.. ఇక టీమిండియాలో చోటు శాశ్వతం అవుతుంది. ఆస్ట్రేలియా పిచ్పై ఆడిన అనుభవం వరుణ్ చక్రవర్తికి లేదు. స్వదేశంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అనుభవం కూడా అతనికి లేదు. నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ పరిస్థితుల్లో అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితుల గురించి వరుణ్ చక్రవర్తి.. ధోనీని అడిగి తెలుసుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలించే పిచ్లపై బంతిని ఎలా స్పిన్ చేయాలనే విషయాలపై చిట్కాలను ధోనీ నుంచి తెలుసుకున్నాడు.
From admiring him from the stands at Chepauk, to now...😍@chakaravarthy29's fairytale continues!#KKR #Dream11IPL #CSKvKKR pic.twitter.com/rk37xW3OQ7
— KolkataKnightRiders (@KKRiders) October 29, 2020
ఐపీఎల్-2020 సీజన్లో వరుణ్ చక్రవర్తి నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటిదాకా 12 మ్యాచ్లను ఆడిన అతను 15 వికెట్లను పడగొట్టాడు. ఒకే మ్యాచ్లో అయిదు వికెట్లను తీసుకున్నాడు. ఆ మ్యాచ్ తరువాతే.. అతనికి టీమిండియా టీ20 స్క్వాడ్లో బెర్త్ దొరికింది. బౌలింగ్ ఎకానమీ కూడా మెరుగ్గా ఉంది. ఓవర్కు సగటున ఏడు పరుగులను ఇచ్చాడంతే. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో ధోనీ.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిలకడగా రాణించడం, పొదుపుగా పరుగులను ఇస్తుండటంతో సెలెక్టర్లు అతణ్ని టీమిండియా టీ20 స్క్వాడ్లోకి తీసుకున్నారు.