Dhoni Six Video:ఎప్పుడొచ్చాం అన్నది కాదు..బంతి బయట పడిందా లేదా..! అదే ఊపు అదే జోష్..!
షార్జా: మంగళవారం చెన్నై సూపర్కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షకులను తప్పకుండా టీవీలకు కట్టిపడేసి ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో సిక్సర్ల మోత మామూలుగా లేదు. బ్యాట్స్మెన్ బంతిని బాదాడంటే అంతే... బంతి అడ్రస్ లేకుండా పోతోంది. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ మొదలు పెట్టిన సిక్సర్ల మోతా మ్యాచ్ ఆసాంతం కొనసాగింది. సంజు శాంసన్ బౌలర్లకు చుక్కులు చూపించగా... ఆ తర్వాత స్టీవ్ స్మిత్తో పాటు చివరిలో జోఫ్రా ఆచర్ కూడా రెచ్చిపోయాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై ముందు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది. ఇక బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 16 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ వారు ప్రదర్శించిన ఆటు తీరును తప్పకుండా అభినందించాల్సిందే.
IPL 2020: ధోనీ జట్టుకు అనుకూలంగా బీసీసీఐ ..?ఏ విషయమంటే.. అసంతృప్తితో ఫ్రాంచైజీలు..!
మ్యాచ్ ఆసాంతం సిక్సర్ల వరద
చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. సిక్సర్లు బౌండరీలు వరదలా పారగా... టామ్ కరన్ విషయంలో ధోనీ అంపైర్లతో వాదించడం మరొక సంఘటన. ఇక ధోనీ నాటౌట్గా ఉండి ఆ జట్టు ఓడిపోయిన ఘటనలు చాలా అరుదు. ఇక ఫ్లాఫ్ డూప్లెసిస్ సంగతి చెప్పక్కర్లేదు. ఒకానొక దశలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ టార్గెట్ను సాధిస్తుందేమో అనే వరకు మ్యాచ్ను తీసుకొచ్చాడు. ఓ డూప్లెసిస్ మరోవైపు ధోనీ ఉండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు చెన్నై సూపర్ కింగ్స్. జట్టు ఓడినప్పటికీ ఫ్యాన్స్కు మాత్రం మాంచి బ్యాటింగ్ ఫీస్ట్ను ఇద్దరూ అందించారు. ఓవైపు డూప్లెసిస్ వరుస పెట్టి సిక్సర్లు బాదుతుండగా మరో వైపు మిస్టర్ కూల్ సమయం చూసి బంతిని బౌండరీని దాటించాడు.
ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా...
ఇక ఓవర్లు ముగుస్తున్న సమయంలో ధోనీ తన బ్యాట్కు పనిచెప్పాడు. ఎంతలా అంటే చివరి ఓవర్లో వరుసగా మూడు భారీ సిక్సులు కొట్టి తాను రిటైర్ అయినప్పటికీ తనలో ఆ సత్తా ఏమాత్రం తగ్గలేదని మరోసారి చాటాడు. భవిష్యత్తులో తనకు బౌలింగ్ వేసే బౌలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లయ్యింది. ఇక టామ్ కరన్ వేసిన చివరి ఓవర్లో తొలి బంతిని స్టేడియం బయటకు పంపాడు ఈ జార్ఖండ్ డైనమైట్ . స్టేడియం బయట అంటే ఆవరణకే పరిమితం కాలేదు.. షార్జా ప్రధాన రహదారిపైకి బంతి పోయిందంటే ఎంత బలంగా బాదాడో అర్థమవుతుంది. అయితే రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి ఆ బంతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం కెమెరా కంటికి చిక్కింది.
ఏ మాత్రం సత్తా తగ్గలేదు
ఆ తర్వాత ధోనీ మరో రెండు సిక్సర్లను బాదాడు. దీంతో వరుసగా మూడు సిక్సులు కొట్టాడు. కానీ చివరిగా జట్టును మాత్రం విజయం వైపు చేర్చలేకపోయాడు. సాధారణంగా ధోనీ నాటౌట్గా ఉన్నాడంటే మ్యాచ్ గెలవడం జరుగుతుంది. కానీ ఇలా జరగడం చాలా అరుదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మూడో నెంబర్ బ్యాట్స్మెన్గా ఎందుకు దిగలేదని ప్రశ్నించగా... చాలా కాలంగా తాను బ్యాటింగ్కు దూరమైయ్యానని కొంత డిఫరెంట్గా ట్రై చేద్దామనే దిగలేదని సమాధానం ఇచ్చాడు ధోనీ. అందుకే సామ్ కరన్, జడేజాలకు అవకాశం ఇచ్చానని అది వర్కౌట్ కాకపోతే తాను నెంబర్ త్రీ స్థానంలో మళ్లీ దిగుతానని చెప్పాడు.