ఢిల్లీ కేపిటల్స్ను మట్టి కరిపించడానికి ఇదే సరైన సమయం: కీలక బ్యాట్స్మెన్ అవుట్
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వేదికగా రసవత్తరంగా ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోన్న టీమ్.. ఢిల్లీ కేపిటల్స్. టాప్ పెర్ఫార్మ్స్తో అదరగొడుతోందా జట్టు. శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, అజింక్య రహానె, కగిసో రబడ, మార్కస్ స్టోయినిస్ వంటి యంగ్ స్టార్టతో నిండి ఉన్న ఢిల్లీ కేపిటల్స్.. వరుసగా మూడు మ్యాచ్ల తరువాత ఓటమిని రుచి చూసింది. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో సమవుజ్జీ చేతిలో ఓడిపోయింది.
ముంబై ఇండియన్స్ చేతిలో అయిదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దిగజారింది. ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ ఆడకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ను చివరి నిమిషంలో తుదిజట్టులోకి తీసుకోలేదు. అతని స్థానంలో అజింక్య రహానేను జట్టులోకి తీసుకున్నారు. ఈ మార్పు.. అనూహ్యంగా చోటు చేసుకున్నదే. నిలకడ లేనప్పటికీ.. ఈ టోర్నమెంట్లో రిషభ్ పంత్ భారీ షాట్లను ఆడుతున్నాడు.
ఇప్పటిదాకా ఆడిన ఆరు మ్యాచుల్లో 176 పరుగులు చేశాడు. 38 అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్. 133 స్ట్రైక్ రేట్తో 35.20 బ్యాటింగ్ యావరేజ్తో ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా అతణ్ని తప్పించింది టీమ్ మేనేజ్మెంట్. డగౌట్కు పరిమితం చేసింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంత్ స్థానంలో ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కీపింగ్ చేశాడు. ఈ మ్యాచ్కే కాదు.. మరో రెండు మ్యాచ్లకు కూడా అతను అందుబాటులో ఉండే అవకాశాలు దాదాపుగా లేనట్టే కనిపిస్తోంది. రిషభ్ను తప్పించడానికి గల కారణాన్ని వెల్లడించాడు కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్.
ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ విషయాన్ని రివీల్ చేశాడు. వారం రోజుల పాటు అతనికి విశ్రాంతి అవసరమైందని పేర్కొన్నాడు. డాక్టర్ల సలహా మేరకు రిషబ్ పంత్కు వారం రోజుల పాటు విశ్రాంతి ఇచ్చినట్లు స్పష్టం చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా పంత్ గాయపడ్డాడని, ఆ గాయం ఇంకా ఇబ్బంది పెడుతోందని చెప్పాడు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని చెప్పాడు. రిషభ్ పంత్ లేకపోవడం బ్యాటింగ్లో లైనప్ బలహీనపడుతుందని, దాన్ని భర్తీ చేయడానికి తమ వద్ద అస్త్రాలు ఉన్నాయనీ పేర్కొన్నాడు అయ్యర్.