ధోనీసేనకు ఫేర్వెల్ మ్యాచ్: బిగ్గర్..బెట్టర్ అండ్ స్ట్రాంగర్: బరువెక్కిన హృదయంతో ఫ్యాన్స్
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో చెన్నై సూపర్ కింగ్స్.. తన చిట్టచివరి మ్యాచ్ను ఆడుతోంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను ఢీకొడుతోంది. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం.. ఈ మ్యాచ్కు వేదికగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్కు ఇది ఫేర్వెల్ మ్యాచ్ కావడంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. బరువెక్కిన హృదయంతో తమ అభిమాన జట్టుకు ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వీడ్కోలు పలకడానికి సిద్ధపడ్డారు. విజయంతో ఈ టోర్నమెంట్కు ముగింపు పలకాలని ప్రార్థిస్తున్నారు.
టాస్ గెలిచి.. ఫీల్డింగ్..
ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ఎంచుకుంది. సమయం గడుస్తున్న కొద్దీ గ్రౌండ్లో పచ్చికపై తేమ చేరుకుంటుండటం వల్ల రెండోసారి బ్యాటింగ్కు దిగిన జట్టుకు భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందనే కారణంతో టీమ్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తేమ వల్ల బంతి మరింత స్పీడ్గా బౌండరీ వైపు దూసుకెళ్లడానికి అవకాశం ఉంటుందనేది అంచనా. శనివారం నాడు జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఇది రుజువైంది కూడా. ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్కు దిగిన జట్లే విజయం సాధించాయి.
అనూహ్యంగా అట్టడుగునకు
ఐపీఎల్-2020 టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టైటిల్ హాట్ ఫేవరెట్గా కనిపించిన చెన్నై సూపర్ కింగ్స్.. అనూహ్యంగా చతికిల పడింది. తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేకపోయింది. తొలి మ్యాచ్లో బోణీ కొట్టినప్పటికీ.. అదే దూకుడును, ఎదురుదాడిని కొనసాగించలేకపోయింది. మ్యాచ్లు సాగే కొద్దీ నిస్సారంగా తయారైంది. బ్యాటింగ్; బౌలింగ్.. చివరికి ఫీల్డింగ్లోనూ ఆకట్టుకోలేకపోయింది. ప్రత్యర్థిపై పట్టు సాధించే వ్యూహాలను రచించలేకపోయింది. ఇప్పటిదాకా 13 మ్యాచ్లను ఆడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఎనిమిదింట్లో ఓడిపోయింది. ఎనిమిది స్థానాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది.
ఫ్యాన్స్ భావోద్వేగం..
ఏ మాత్రం అంచనాలకు అందని విధంగా తాము ఆరాధించే జట్టు ఐపీఎల్-2020 సీజన్ నుంచి ప్లేఆఫ్కు కూడా చేరకుండా వైదొలగాల్సి రావడంపై అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలకుతున్నారు. ఈ మ్యాచ్లో గెలవాలని ప్రార్థిస్తున్నారు. ఐపీఎల్-2021 సీజన్ నాటికి తిరుగులేని విధంగా జట్టు తయారవుతుందని, ధోనీ సారథ్యంలోనే జట్టు ఆడుతుందని కోరుకుంటున్నారు. ఇప్పటి పరాజయాలకు వచ్చే ఏడాది సీజన్లో బదులు తీర్చుకుంటుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎంత వేగంగా జట్టు వెనక్కి వెళ్తుందో.. దానికి రెట్టింపు వేగంతో సత్తా చాటుతుందని ఆశిస్తున్నారు.
పంజాబ్ కింగ్స్కు లైఫ్ అండ్ డెత్ గేమ్..
మరోవంక- ఈ మ్యాచ్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు లైఫ్ అండ్ డెత్ గేమ్గా మారింది. కింగ్స్ పంజాబ్కు కూడా లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిస్తే.. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందా జట్టుకు. లేదంటే- ప్లే ఆఫ్ ముంగిట నిల్చొన్న ఇతర టీమ్ల నెట్ రన్రేట్పై దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పంజాబ్ జట్టు ఓడిపోతే.. ముందుకెళ్లే అవకాశాలు దాదాపుగా లేకపోవచ్చు. అదే సమయంలో మిగిలిన జట్లు విజయం సాధించడమంటూ జరిగితే.. పంజాబ్ జట్టు ప్రస్థానం 12 పాయింట్ల వద్దే ఆగిపోతుంది.