IPL 2020 Finals:ఆడుతూ..పాడుతూ..ఐదో సారి కప్ను ముద్దాడిన ముంబై ఇండియన్స్
దుబాయ్: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఇప్పటికే నాలుగు టైటిళ్లు సొంతం చేసుకున్న ఆ జట్టు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మరో టైటిల్ను డిఫెండ్ చేసుకుంది. ఐపీఎల్ 2020 సీజన్ ఆసాంతం ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన రోహిత్ సేన.. మంగళవారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో కూడా బౌలింగ్, బ్యాటింగ్లో చెలరేగి 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. తద్వార రోహిత్ సేన ఐదో సారి చాంపియన్గా నిలిచింది.
ఇక బలమైన ముంబై ఇండియన్స్ ముందు సెంటిమెంట్లన్నీ కొట్టుకుపోయాయి. అయితే ఎంతో ఆసక్తికరంగా సాగుతుందునుకున్న ఫైనల్ మ్యాచ్ ఏ మాత్రం పస లేకుండా చప్పగా సాగడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అసలు ఇది ఫైనలేనా? అనే సందేహం కలిగింది. బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్ కనీస పోరాట పటిమ కనబర్చకపోవడం అందర్ని విస్మయపరిచింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 65 నాటౌట్), రిషభ్ పంత్( 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 56) రాణించారు. ముంబై బౌలర్లలో బౌల్ట్(3/30) ఢిల్లీ పతనాన్ని శాసించగా.. కౌల్టర్ నీల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 68) అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ మంచి శుభారంభాన్ని అందించారు. స్టోయినిస్ వేసిన ఐదో ఓవర్లో డికాక్(20) కీపర్ క్యాచ్గా వెనుదిరిగినా.. రోహిత్ బౌండరీలు బాదడంతో పవర్ ప్లే ముగిసే సరికి ముంబై 61 రన్స్ చేసింది. ఇక క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కూడా ధాటిగా ఆడాడు. ఈ జోడీ భాగస్వామ్యం హాఫ్ సెంచరీకి సమీపిస్తుండగా.. రోహిత్ శర్మ లేని పరుగుకు ప్రయత్నించడంతో సూర్య(19) రనౌట్గా వెనుదిరిగాల్సి వచ్చింది. దాంతో రెండో వికెట్కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషాన్తో రోహిత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. రబడా వేసిన 12 ఓవర్లో బౌండరీతో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన హిట్ మ్యాన్ ఢిల్లీ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మరోవైపు ఇషాన్(33 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించాడు. అయితే రోహిత్ శర్మ, పొలార్డ్(9), హార్దిక్ పాండ్యా వరుస ఓవర్లలో ఔటైనా.. కావాల్సిన పరుగులు తక్కువ ఉండటంతో ముంబై విజయం లాంఛనమైంది.