IPL 2020 Finals:దుమ్మురేపిన రిషబ్, శ్రేయాస్.. సరికొత్త రికార్డు..!
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్లో హాఫ్ సెంచరీలతో రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 65 నాటౌట్), వికెట్ కీపర్ రిషభ్ పంత్( 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 56) అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు. 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సూపర్ బ్యాటింగ్తో 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి గట్టెక్కించారు. దాంతో ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో పిన్నవయస్కుడిగా రిషభ్ పంత్ గుర్తింపు పొందగా.. టైటిల్ ఫైట్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రెండో కెప్టెన్గా అయ్యర్ అరుదైన ఘనతను అందుకున్నాడు.
రిషభ్ పంత్ 23 ఏళ్ల 37 రోజుల వయసులో ఐపీఎల్ ఫైనల్లో అర్థ శతకం సాధించగా, అంతకుముందు మనన్ వోహ్రా పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఫైనల్లో వోహ్రా అర్థ శతకం నమోదు చేశాడు. వోహ్రా 20 ఏళ్ల 318 రోజుల వయసులో హాఫ్ సెంచరీ ఈ జాబితాలో టాప్లో ఉన్నాడు. ఆ నాటి మ్యాచ్లో వోహ్రా 67 పరుగులు చేశాడు. ఇక 2016 ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ 69 రన్స్తో టాప్లో ఉండగా.. అయ్యర్ 65 నాటౌట్తో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 2013లో ధోనీ(63 నాటౌట్), 2016 ఫైనల్లో విరాట్ కోహ్లీ(54), 2017లో స్టీవ్ స్మిత్(51), 2015లో రోహిత్ శర్మ(50) వరుసగా ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్(3/30) ఢిల్లీ పతనాన్ని శాసించగా.. కౌల్టర్ నీల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు. శిఖర్ ధావన్(15), మార్కస్ స్టోయినిస్(0), అజింక్యా రహానే(2) దారుణంగా విఫలమయ్యారు.