SRH vs RCB:ఇది టూమచ్.. కోహ్లీని ఇంకా కెప్టెన్గా ఎందుకు కొనసాగిస్తున్నారు: గంభీర్
ఢిల్లీ: శుక్రవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమించింది. ఫైనల్ చేరి మొదటిసారి కప్పు సాధించాలనే బెంగళూరు కోరిక అలాగే మిగిలిపోయింది. బెంగళూరు 13 ఏళ్లపాటు ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ.. ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోవడంతో ఆ జట్టు అభిమానులను కలవరానికి గురి చేసింది. 'విరాట్ కోహ్లీ ఉన్నన్ని రోజులు బెంగళూరు ఐపీఎల్ లీగ్లో విజేతగా నిలవలేదు' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా బెంగళూరు సారథి విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించారు. కెప్టెన్సీ నుంచి కోహ్లీని తీసేయాలని అభిప్రాయపడ్డాడు.
తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవకుండా 8 ఏళ్లు కొనసాగడం చాలా ఎక్కువ. రవిచంద్రన్ అశ్విన్ని చూడండి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు రెండేళ్లే కెప్టెన్గా ఉన్నాడు. ఫలితం అనుకూలంగా లేకపోవడంతో తప్పించారు. మనం ఎలాగైతే రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ గురించి మాట్లాడతామో.. విరాట్ కోహ్లీ కూడా అంతే. ధోనీ చెన్నైకి మూడు సార్లు, రోహిత్ ముంబైకి నాలుగుసార్లు టైటిల్స్ అందించారు. అందుకే ప్రాంచైజీలు వారిని ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు. వారి సారథ్యం కూడా బాగుంది' అని చెప్పాడు.
'ఒకవేళ రోహిత్ శర్మ ఇలాగే (విరాట్ కోహ్లీలా బెంగళూరు జట్టుకు టైటిల్ అందించకపోవడం) ఎనిమిదేళ్లు రాణించకపోయి ఉంటే.. అతడిని కూడా తొలగించేవారే. ఒక్కొక్కరికీ ఒక్కో రూల్ ఉండదు. ఇక్కడ అందరూ సమానమే. మొత్తంగా ఎవరికైనా విజయాలే కావాలి. ఏ సమస్య ఉన్నా, ఏ బాధ్యత అయినా కెప్టెన్ నుంచే మొదలవ్వాలి. అది జట్టు యాజమాన్యం లేదా ఇతర సిబ్బంది నుంచి కాదు. ఒక కెప్టెన్గా గెలిచినప్పుడు ఎలాగైతే క్రెడిట్ దక్కుతుందో.. ఓటమిపాలైనప్పుడు కూడా అలాగే విమర్శలు ఎదుర్కోవాలి' అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
'మేము ప్లేఆఫ్స్కు అర్హత సాధించాం, ప్లేఆఫ్స్కు వెళ్ళడానికి మేము అర్హులం అని మీరు చెప్పవచ్చు. కానీ ఖచ్చితంగా కాదు. వాస్తవానికి బెంగళూరుకు ప్లేఆఫ్స్కు వెళ్లే అర్హత లేదు. నాలుగు వరుస ఓటముల తర్వాత ఆర్సీబీ ప్లేఆఫ్ చేరే అర్హతను కోల్పోయింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అదృష్టంగా కొద్దీ సూపర్ ఓవర్లో గెలిచింది. 8 ఏళ్లు చాలా ఎక్కువ. విరాట్ కోహ్లీ అనుభవజ్ఞుడైన్నది ఇక్కడ విషయం కాదు. అతడు భారత జట్టుకు సారథి కావొచ్చు.. మరేదైనా కావచ్చు. కానీ మనకు ఫలితాలు కావాలి. ఆట అంటేనే ఫలితాలు' అని గౌతమ్ గంభీర్ అన్నాడు.
'బెంగళూరు ఎక్కువగా కోహ్లీ, డివిలియర్స్పైనే ఆధారపడుతోంది. ఈ సీజన్లో ఆర్సీబీ పూర్తిగా విఫలం కాకుండా.. డివిలియర్స్ కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. డివిలియర్స్ కూడా రాణించకపోతే.. బెంగళూరు పరిస్థితి ఎలా ఉండేది?. బెంగళూరు గెలిచిన ఏడు మ్యాచ్ల్లో రెండు మూడు మ్యాచ్లను డివిలియర్స్ గెలిపించాడు. కానీ కలిసికట్టుగా ఆ జట్టు ఏం చేయలేదు. ఈ విషయంలో గత ఏడాది లాగే ఆడింది. డివిలియర్స్ ఒక్కడి వల్లే ఆర్సీబీ ప్లేఆఫ్ చేరగలిగింది. కానీ ఐపీఎల్లో బలమైన జట్టుగా ఉండటానికి ఇదొక్కటే సరిపోదు' అని గంభీర్ చెప్పుకొచ్చాడు. .