సింగం రిటర్న్స్: ఒక్క మ్యాచ్తో కథలో మలుపు: ధోనీ సేనతో పోరు: ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే
దుబాయ్: ఎక్కువమంది అనుభవజ్ఞులు, ఆల్రౌండర్లతో నిండిపోయిన ఐపీఎల్ జట్లలో టాప్ ప్లేస్ ఉండే టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. అందులో ఆడే క్రికెటర్ల వయస్సు కూడా ఎక్కువే. మెజారిటీ ప్లేయర్ల వయస్సు థర్టీ ప్లస్. లాక్డౌన్ వల్ల ఇంటి పట్టునే ఉంటూ, ప్రాక్టీస్ లేక, శరీరాలను పెంచేశారని, ధనాధన్ ఐపీఎల్లో ఆడటం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతూ వచ్చాయి. తొలి మ్యాచ్ మినహా.. ఆడిన అన్నింట్లోనూ దారుణంగా పరాజయంపాలు కావడం.. ఈ అభిప్రాయాలకు మరింత బలాన్ని కలిగించాయి. పాయింట్ల పట్టికలో ఇక చెన్నై పైకి లేవలేదనే వాదనలూ వినిపించాయి.
సింహాల జూలు పట్టి ఆడుకోవడం ఎంత ప్రమాదకరమో..
ఒక్క మ్యాచ్.. ఒకే ఒక్క మ్యాచ్తో ఆ విమర్శలన్నింటినీ తుడిచి పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. జట్టుపై పడిన మరకలన్నింటినీ సర్ఫ్ వేసి మరీ ఉతికి పారేసింది. సీనియర్ల ముందు జూనియర్లు బలాదూర్ అనిపించింది. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే.. బౌలర్లకు చుక్కలు చూపిస్తామనే సందేశాన్ని పంపించింది. అపారమైన క్రికెట్ ఆడిన తమ అనుభవం ఎలాంటిదో కుర్ర క్రికెటర్లకు ప్రత్యక్షంగా నేర్పించింది. సింహాల జూలు పట్టి ఆడుకోవాలనుకోవడం ఎంత ప్రమాదకరమో స్పష్టం చేసింది ధోనీ సేన.
అత్యధిక పార్ట్నర్షిప్..
ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం రాత్రి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ల విజృంభణకు అద్దం పట్టింది. పంజాబ్ విధించిన 178 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా కొట్టేసింది. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 181 పరుగులను సాధించింది ధోనీ సేన. ఈ క్రమంలో అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రికార్డును నెలకొల్పింది. 181 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇదే తొలిసారి. ఓవరాల్గా మూడోది.
ఇప్పటిదాకా అదే హయ్యెస్ట్..
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇప్పటిదాకా 159 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ఉండేది. అదే హయ్యెస్ట్. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఈ రికార్డును నెలకొల్పింది చెన్నై. మైక్ హస్సీ, మురళీ విజయ్ పేరు మీద ఉందా రికార్డు. 2013లో ఇదే జంట.. ఇదే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్పై 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ రికార్డును షేన్ వాట్సన్, ఫాఫ్ డుఫ్లెసిస్ జోడీ తుడిచి పెట్టేసింది. 181 పరుగుల అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను నెలకొల్పింది. మొత్తం మీద డేవిడ్ వార్నర్-జానీ బెయిర్స్టో గత ఏడాది నెలకొల్పిన 185 పరుగుల రికార్డు చెక్కు చెదరలేదు.
ఇక బ్రేకులుండవా?
ఇప్పటిదాకా ఎదుర్కొన్న విమర్శలన్నింటినీ ఈ ఒక్క మ్యాచ్తో తుడిచిపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇక తమకు తిరుగు లేదనే సందేశాన్ని పంపించినట్టయింది. ఇక తన తదుపరి మ్యాచుల్లో ధోనీ సేన కోల్కత నైట్ రైడర్స్ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్.. బుధవారం జరుగనుంది. దాని తరువాత శనివారం రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొనబోతోంది. తన రికార్డు గెలుపు గాలివాటం కాదనే విషయాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత చెన్నై సూపర్ కింగ్స్పై ఉంది. బలమైన కోల్కత నైట్ రైడర్స్పై ఇదే దూకుడును కొనసాగిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.