IPL 2020: ఐపీఎల్ ఆడేందుకు ఎంతో ఎదురు చూశా.. ఆమెను వదిలేసి వచ్చేశా: జేసన్ హోల్డర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ లేటుగా యూఏఈ వచ్చిన విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభంలోనే బెంగళూరుతో మ్యాచ్లో గాయపడిన ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో హోల్డర్ను సన్రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నది. హోల్డర్ టోర్నీలోకి లేటుగా అడుగు పెట్టినా.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే తన కోటా 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. హోల్డర్ దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
మ్యాచ్ అనంతరం జేసన్ హోల్డర్ మాట్లాడుతూ... సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నుంచి పిలుపు అందడంతో వెకేషన్ మధ్యలోనే తన భార్యను వదిలేసి వచ్చేశానని తెలిపాడు. 'నా భార్యతో కలిసి వెకేషన్కు వెళ్లా. అదే సమయంలో సన్రైజర్స్ యాజమాన్యం నుంచి పిలుపు వచ్చింది. అందుకు చాలా సంతోషపడ్డా. వెకేషన్ మధ్యలోనే నా భార్యను వదిలేసి రావడం కష్టంగానే అనిపించింది. కష్టంగా ఉంది కూడా. అయితే క్రికెట్ ఆడటం కోసం తప్పలేదు' అని జేసన్ హోల్డర్ తెలిపాడు.
'సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మళ్లీ ఐపీఎల్ ఆడడం కోసం నాకు అవకాశం ఇచ్చింది. ఇందుకు వారికి కృతజ్ఞతలు. ఐపీఎల్లోకి తిరిగి అడుగుపెట్టే అవకాశం కోసం ఎదురు చూశా. చివరికి నాకు ఇలా అదృష్టం వచ్చింది. తొలి మ్యాచులోనే మంచి ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది' అని వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ చెప్పాడు. హోల్డర్ చివరిసారిగా 2016లో ఐపీఎల్ ఆడాడు. గతంలో మూడు సీజన్లలో ఆడాడు. అప్పుడు ఒక మ్యాచ్లో రెండు కంటే ఎక్కువ వికెట్లు తీయలేదు కానీ ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు.
గాయపడిన మిచెల్ మార్ష్ స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన జేసన్ హోల్డర్.. నిన్నటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. తుది జట్టులో నాలుగు విదేశీ ఆటగాళ్ల నిబంధన కారణంగా అతనికి అవకాశం రాలేదు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ తుది జట్టులో ఆడుతున్నారు. అయితే విలియమ్సన్ గాయపడడంతో.. ఆ స్థానంలో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో హోల్డర్ ఆడాడు. ఆడడమే కాదు ఔరా అనిపించాడు. సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, రియాన్ పరాగ్లను ఔట్ చేశాడు.