ధోనీసేన.. ఇక ఇంటికేనా? ప్లేఆఫ్ రేస్ నుంచి ఎల్లో ఆర్మీ అవుట్? నిలవాలంటే? అక్కడే ఫెయిల్
షార్జా: చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ టైటిల్ హాట్ ఫేవరెట్. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ఎల్లో ఆర్మీ తరువాతే.. ఇంకే జట్టయినా. ఇదివరకట్లాగే ఈ సీజన్లో కూడా ఒక్క ముంబై ఇండియన్స్ మాత్రమే చెన్నైకి బలమైన ప్రత్యర్థిగా భావించారు. మిగిలిన జట్లు ధోనీ సేన ముందు తేలిపోతాయనీ అంచనా వేశారు.. ఇది ఐపీఎల్-2020 మెగా టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఉన్న అంచనాలు. టోర్నీ ఆరంభం మ్యాచ్లోనూ చెన్పై సూపర్ కింగ్స్ బోణీ కొట్టడం కూడా ఈ అంచనాలను మరింత పెంచింది.
మ్యాచ్లు సాగుతున్న కొద్దీ..
మ్యాచ్లు కొనసాగుతున్న కొద్దీ.. ఆ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. అభిమానుల ఆశలు నీరుగారాయి. చెన్నై సూపర్ కింగ్స్ పసుపు వీరులు.. ఆరంభ శూరులు అని రుజువైంది. పెద్దగా అంచనాలు లేని జట్ల ముందు కూడా తలవంచుతోంది ఎల్లో ఆర్మీ. ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటిదాకా తొమ్మిది మ్యాచ్లను ఆడిన చెన్నై.. గెలిచింది మూడింట మాత్రమే. ఆరు మ్యాచ్లల్లో ఘోరంగా ఓడింది. గెలవ దగ్గ మ్యాచ్లను కూడా చేతులారా పోగొట్టుకుంటోంది. శనివారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా వేదికగా సాగిన మ్యాచ్.. మరోసారి ఈ విషయాన్ని స్పస్టం చేసింది.
ఇంకా ఎవరికైనా ఆశలు ఉన్నాయా?
చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉన్న దశలో మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ధోనీ వ్యూహాలు చిత్తు అయ్యాయి. బ్యాట్స్మెన్ ఎదురుదాడికి చెన్నై బౌలర్ వద్ద సమాధానమే లేకుండాపోయింది. అయిదు బంతుల్లో టార్గెట్ను అందుకుంది ఢిల్లీ కేపిటల్స్. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న రవీంద్ర జడేజాకు చివరి ఓవర్ను అప్పగించడం వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అందుబాటులో మరో బౌలర్ లేకపోవడం వల్లే ధోనీ.. జడేజా చేతికి బంతిని అప్పగించాడు. అది బెడిసి కొట్టింది. ఈ ఓటమి తరువాత చెన్నై సూపర్ కింగ్స్ విజయావకాశాలపై ఇక ఆశలు ఉండకపోవచ్చు.
అక్షర్ పటేల్ కౌంటర్ అటాక్..
చివరి ఓవర్ను రవీంద్ర జడేజాకు అప్పగించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. జడేజా.. మరీ అంత నాసిరకం బౌలర్ ఏమీ కాదు. పొదుపుగా పరుగులు ఇవ్వగలడు. వ్యూహాత్మకంగా బంతులను సంధించగలడు. బ్యాట్స్మెన్ను కట్టిపడేయగలడు. కాస్త దూకుడుగా ఆడితే విజయం ఖాయమనే సమయంలో అలాంటి వాటినేవీ లెక్క చేయలేదు బ్యాట్స్మెన్. బౌలర్పై ఆధిపత్యాన్ని సాధించాడు. అయిదు బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించాడు. తాను ఎదుర్కొన్న చివరి నాలుగు బంతుల్లో మూడు సిక్సులను కొట్టి.. కార్యాన్ని పూర్తి చేశాడు అక్షర్ పటేల్.
Recommended Video
జడేజా ఎందుకు?
చివరి ఓవర్ను రవీంద్ర జడేజాకు అప్పగించడానికి కారణం లేకపోలేదు. ఫాస్ట్ బౌలర్ డ్రేన్ బ్రావో అనారోగ్యానికి గురయ్యాడు. అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. ఇక నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయాల్సింది ఇద్దరే బౌలర్లు. రవీంద్ర జడేజా.. కర్ణ్ శర్మ. కర్ణ్ శర్మ అప్పటికే మూడు ఓవర్లలో 34 పరుగులను సమర్పించుకున్నాడు. అందుకే అతని వైపు మొగ్గ చూపలేదు ఎంఎస్ ధోనీ. అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజాకు బంతిని అప్పగించాడు. అది కాస్తా బెడిసి కొట్టింది. వైడ్తో చివరి ఓవర్ను ఆరంభించాడు జడేజా. 22 పరుగులను సమర్పించుకున్నాడు.
ఈ టోర్నమెంట్లో నిలవాలంటే..
ఈ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ నిలవాలీ అంటే.. ప్రతి ఒక్క మ్యాచ్ను కూడా భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా తొమ్మిది మ్యాచ్లను ఆడిన ఎల్లో ఆర్మీ.. మూడు మ్యాచ్లల్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఆ జట్టు నెట్ రన్రేట్ మైనస్ 0.386. ఖాతాలో ఉన్నవి ఆరు పాయింట్లే. మరో అయిదు మ్యాచ్లను చెన్నై సూపర్ కింగ్స్ ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే కనీసం నాలుగు మ్యాచ్లను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది.