IPL 2020: దుమ్మురేపిన ఇషాన్ కిషన్...గర్ల్ఫ్రెండ్ ఫిదా.. ఇన్స్టాలో ఏం పోస్ట్ చేసిందంటే..?
ఐపీఎల్లో భాగంగా అక్టోబర్ 23న ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ తరపున ఓపెనింగ్ దిగాడు ఇషాన్ కిషన్. క్వింటన్ డీ కాక్తో పాటు రంగంలోకి దిగిన ఇషాన్ కిషన్ తన క్లాసీ ఆటతో ఆకట్టుకున్నాడు. సీజన్ తొలిభాగంలో సౌరభ్ తివారీ గాయపడటంతో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన స్థానంను సుస్థిరం చేసుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ 99 పరుగులు చేసినప్పటికీ ముంబై జట్టు మాత్రం విజయతీరాలకు చేరుకోలేకపోయింది. అయితే నిన్న షార్జా క్రికెట్ గ్రౌండ్లో మాత్రం ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. అతన్ని ఎలా అడ్డుకోవాలో ధోనీసేనకు అంతు చిక్కలేదు.
ఓపెనింగ్ దిగిన ఇషాన్ కిషన్ తొలి బంతి నుంచే చెన్నైకు చుక్కలు చూపించాడు. 37 బంతుల్లో 68 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఆడిన పది మ్యాచుల్లో ఏడు మ్యాచుల్లో గెలిచినట్లయ్యింది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. బౌలర్లకు విసుగు వచ్చేలా బంతిని బౌండరీకి తరలించాడు. మరోవైపు సీనియర్ ఆటగాడు డీకాక్ మాత్రం ఆచి తూచి ఆడాడు.మొత్తంగా కిషాన్ ఆరు బౌండరీలు, ఐదు సిక్కులతో 183.78 స్ట్రైక్ రేట్తో పిచ్చెక్కించాడు. మొత్తానికి ఎనిమిది మ్యాచుల్లో 261 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్.
ఇదిలా ఉంటే ఇషాన్ గర్ల్ఫ్రెండ్గా వార్తలు వస్తున్న అదితీ హుందియా కిషన్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించింది. కిషాన్ బాదిన భారీ సిక్సు ఒకటి స్టేడియం బయట పడింది. దీన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు ఫియా అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక ముంబై ఇండియన్స్ మొదటి నుంచి ఇటు బౌలింగ్లో అటు బ్యాటింగ్లో ఆధిపత్యం కొనసాగించింది. ఎక్కడా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లను కుదురుకునేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. తొలి ఆరు ఓవర్లలోనే ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాలు 24 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టారు. ఇక మిడిల్ ఓవర్స్లో లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ విజృంభించడంతో చెన్నై కుదేలైంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ శాం కరన్ మాత్రమే 52 పరుగులు చేసి జట్టు 100 పరుగులు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. ఏడో నెంబర్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగిన కరన్ 47 బంతుల్లో 52 పరుగులు చేశాడు.ఇక 20 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ బోర్డుపై ఉంచింది. ఇక ఈ స్వల్ప టార్గెట్ను ముంబై ఇండియన్స్ మరో 46 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.