IPL 2020: నేను ఆడగలను..జట్టులో చోటుందా: వైరల్గా కరీనా పోస్టు..ఢిల్లీ క్యాపిటల్స్ స్పందన ఇదీ..!
2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటికీ ప్రపంచ క్రీడల్లో ఒక మెగా టోర్నీగానే ముందువరుసలో నిలుస్తోంది. కరోనా కారణంగా ఈ సారి ఐపీఎల్ టోర్నమెంట్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఎక్కడా ఆ జోష్ తగ్గలేదు. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐపీఎల్ టోర్నమెంట్ దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా అన్ని మ్యాచులు చివరి బంతి వరకు ఉత్కంఠతతో సాగాయి. ఇంకా టోర్నమెంట్ సగానికి మాత్రమే చేరుకోగా ఇప్పటికే అభిమానులకు ఈ మెగా టోర్నీ నుంచి రావాల్సిన యాక్షన్ వచ్చేసింది. చూడాల్సిన క్యాచులు చూసేశారు. ఐపీఎల్ను ఒక్క సామాన్యులు మాత్రమే చూస్తూ ఎంజాయ్ చేయడం లేదు.. సెలబ్రిటీలు కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనాకపూర్ ఇన్స్టాగ్రామ్లో తన కొడుకు తైమూర్ ఫోటోను షేర్ చేసింది. అందులో ఈ బుడ్డి తైమూర్ బ్యాటింగ్ టాలెంట్ను ప్రదర్శిస్తున్నట్లుగా కనిపించాడు. అయితే ఈ కుటుంబానికి క్రికెట్తో పరిచయం ఉంది. స్వతహాగా నవాబులైన సైఫలీఖాన్ కుటుంబంలో క్రికెట్ కూడా ఓ భాగమైపోయింది. ఎందుకంటే సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడీ భారత క్రికెట్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించాడు. అంతేకాదు సైఫ్ అలీఖాన్, తన పెద్ద కుమారుడు ఇబ్రహీంలు కూడా క్రికెట్కు వీరాభిమానులే.
ఇక కరీనా పోస్టు చేసిన ఈ ఫోటోతో పాటు మరో క్యాప్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇదే నెటిజెన్లను క్రికెట్ అభిమానులను అట్రాక్ట్ చేసింది. "ఐపీఎల్లో చోటు దక్కుతుందా..? నేను కూడా క్రికెట్ ఆడగలను " అంటూ రాసి ఉన్న పోస్టు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక కరీనా కపూర్ ఈ పోస్టును పెట్టగానే వైరల్గా మారింది. వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ స్పందించింది. తైమూర్కు తమ జట్టులో స్థానం కల్పిస్తామంటూ స్పందన తెలియజేసింది. నవాబు ఢిల్లీకి చెందిన వాడు కాబట్టి తైమూర్ తమ జట్టుకు ఆడటాన్ని ఆస్వాదిస్తామని ఢిల్లీ క్యాపిటల్స్ రెస్పాండ్ అయ్యింది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండటంతో పూర్తి కాన్ఫిడెన్స్తో టోర్నీలో దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడగా ఆరింటిలో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ జట్టులో సూపర్ బ్యాట్స్మెన్తో పాటు, వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్లు, ఇతర ఆల్రౌండర్లతో జట్టు సమతూకంగా ఉండటం బాగా కలిసొస్తోందని పలువురు క్రీడా నిపుణులు చెబుతున్నారు.