IPL 2020: కింగ్స్ లెవన్ పంజాబ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్, రాహుల్ గెలుపు బాటపట్టేనా?
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 టోర్నీలో శనివారం ఆసక్తికరమైన పోరు జరగనుంది. పాయింట్ల పట్టిక అట్టడుగున ఉన్న కింగ్స్ లెవన్ పంజాబ్.. కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. టోర్నీలో కొనసాగాలంటే పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
Recommended Video
పంజాబ్ ఖాతాలో ఒకే ఒక్క విజయం..
ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు కేవలం ఒకే ఒక విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. కెప్టెన్ కేఎల్ రాహుల్ తనవంతుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఈ జట్టుకు మాత్రం విజయాలు ఆమడ దూరంగానే ఉంటున్నాయి. కాగా, సిక్సుల వీరుడు క్రిస్ గేల్ ఈ జట్టులో అందుబాటులో లేకపోవడం పెద్ద లోటేనని చెప్పవచ్చు.
క్రిస్ గేల్ విజృంభిస్తాడా?
అయితే, శనివారం జరిగే మ్యాచ్ కు క్రిస్ గేల్ పంజాబ్ జట్టులో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్రిస్ గేల్ తనదైన శైలిలో బ్యాటును ఝలిపిస్తే పంజాబ్ జట్టు భారీ స్కోరు చేయడం ఖాయమే. క్రిస్ గేల్ గ్లేన్ మ్యాక్స్వెల్ స్థానంలో ఆడే అవకాశం ఉంది. మాక్స్వెల్ ఆరు ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 48 పరుగులే చేయడం గమనార్హం. గ్లేన్ విఫల ప్రదర్శన కూడా పంజాబ్ జట్టు ఓటమికి కారణంగా తెలుస్తోంది. క్రిస్ గేల్ అస్వస్థత కారణంగా ఇంతకాలం జట్టుకు దూరంగా ఉన్నాడు.
మెరుగైన కోల్కతా ప్రదర్శన
ఇక కోల్కతా నైట్రైడర్స్ జట్టు విషయానికొస్తే ఈ జట్టు ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే, పంజాబ్ జట్టు కంటే మెరుగ్గానే కనిపిస్తోంది. ఐదు మ్యాచులు ఆడిన ఈ జట్టు మూడింటిలో విజయాన్ని నమోదు చేసింది. దినేష్ కార్తీక్ నాయకత్వంలోని ఈ జట్టు మంచి ఆటగాళ్లతో సమష్టిగా రాణిస్తూ వరుస విజయాలను నమోదు చేస్తోంది. కోల్కతా.. చెన్నై లాంటి బలమైన జట్లను కూడా మట్టి కరిపించడం గమనార్హం.
రాహుల్ గెలుపు బాట పట్టేనా?
శనివారం జరిగే మ్యాచులో దినేష్ కార్తిక్పై కేఎల్ రాహుల్ పై చేయి సాధిస్తాడా? గెలుపు బాట పడతాడా? లేక మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంటాడా? అనేది వేచి చూడాల్సింది. అబుదాబిలోని జయేద్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. శనివారం మధ్యాహ్నం 3.30గంటల నుంచి ప్రత్యక్ష ప్రసాం కానుంది. కాగా, శనివారం మరో మ్యాచ్ కూడా జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30గంటల నుంచి ప్రసారం కానుంది.