IPL 2020: కేకేఆర్ వర్సెస్ చెన్నై: ధోనీ ముందు దినేష్ కార్తీక్ నిలిచేనా?
దుబాయ్: పేలవ ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల నుంచి కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు కార్తీక్.
Recommended Video
కేకేఆర్కు దినేష్ కార్తీకే మైనస్ అవుతున్నాడు!
కోల్కతా నైట్రైడర్స్ జట్టులో ఇంగ్లాండ్ జట్టుకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నప్పటికీ.. జట్టు యాజమాన్యం మాత్రం దినేష్ కార్తీక్ నాయకత్వంపై నమ్మకాన్ని పెట్టుకుంది. అయితే, నాలుగు మ్యాచుల్లో కలిపి కేవలం 37 పరుగులకే పరిమితమైన దినేష్ కార్తీక్పై కోల్కతా అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన కోల్కతా.. రెండింటిలో విజయం సాధించింది.
బలమైన జట్టే అయినప్పటికీ..
జట్టులో మోర్గాన్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరేన్, టామ్ బాంటన్, కెవిన్ పీటర్సన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నప్పటికీ కేకేఆర్ జట్టు అంతగా రాణించలేకపోతోంది. బౌలింగ్ విభాగంలోనూ మంచి ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. దినేష్ కార్తీక్ వారందరినీ జట్టు అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడం లేదు. ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కుమిన్స్ అంతగా రాణించలేకపోతున్నారు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్కు దినేష్ ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సి ఉంది. కాగా, గత మ్యాచుల్లో మోర్గాన్, రాహుల్ త్రిపాఠిలు కొంత మేర రాణించారు.
ధోనీ ముందు కార్తీక్ నిలిచేనా?
ఇక చెన్నై జట్టు విషయానికొస్తే.. కెప్టెన్ ఎంఎస్ ధోనీయే ఆ జట్టుకు కొండంత బలం. మూడుసార్లు ఐపీఎల్ గెలిచిన జట్టు. కోల్కతాపై ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. షేన్ వాట్సన్, ఆస్సీ లాంటి కీలక ఆటగాళ్లు కూడా ఉన్నారు. పంజాబ్ తో జరిగిన మ్యాచులో వాట్సన్, డుప్లిసిస్ ఇద్దరే మొత్తం స్కోరును బాదేయడం గమనార్హం. చెన్నై అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ పరంగా బలంగానే ఉంది. అయితే, ధోనీ ముందు దినేష్ కార్తీక్ నిలబడతాడా? అనేది సందేహంగానే ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చెన్నై జట్టుపై కేకేఆర్ గెలిచే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. కాగా, ఐదు మ్యాచులాడిన చెన్నై రెండింటిలో విజయం సాధించింది. కోల్ కతా-చెన్నై మ్యాచ్ అబూదాబిలోని షేక్జాయేద్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 7.30 నుంచి ప్రత్యక్షప్రసారం కానుంది.