IPL 2020: పంజాబ్ వర్సెస్ రాజస్థాన్: ప్లేఆఫ్ కోసం రాహుల్ పోరాటం, స్మిత్ సేనకు చావోరేవో
అబూదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో శుక్రవారం మరో కీలక మ్యాచ్ జరగనుంది. కింగ్ లెవన్ పంజాబ్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ కంటే పంజాబ్ జట్టు ముందుంది.
కేఎల్ రాహుల్ నేతృత్వంలో పటిష్టంగానే పంజాబ్..
కేఎల్ రాహుల్ నేతృత్వంలోనే పంజాబ్ జట్టు ఈ టోర్నీలో నిలకడగానే రాణిస్తోంది.ఈ జట్టు వరుసగా ఐదు విజయాలను నమోదు చేయడం గమనార్హం. మొత్తం 12 మ్యాచులు ఆడిన పంజాబ్.. ఆరు విజయాలను నమోదు చేసింది. మరో ఆరు మ్యాచులలో ఓటమిపాలైంది. ఇక స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు టోర్నీలో తడబడుతూనే విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన రాజస్థాన్ జట్టు.. ఐదు విజయాలను నమోదు చేసింది. మరో ఏడు మ్యాచుల్లో పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
ఈ మ్యాచ్ రాజస్థాన్కు చావోరేవో..
ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్లోకి ప్రవేశించింది. ఇప్పుడు మిగిలిన మూడు జట్లు ఏవైనదే తేలాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు శుక్రవారం నాటి మ్యాచులో ఓటమిపాలైతే ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ పంజాబ్ పరాజయం పాలైతే ఆ జట్టుకు మరో అవకాశం ఉంటుంది. టోర్నమెంటులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్న కేఎల్ రాహుల్ పంజాబ్ జట్టును విజయతీరాలకు చేర్చాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ జట్టుకు క్రిస్ గేల్ మరో అదనపు బలంగా ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ కూడా శుక్రవారం నాటి మ్యాచుకు అందుబాటులోకి రానున్నాడు. మోకాలి గాయంలో ఇతడు రెండు మ్యాచులకు దూరమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టు బలంగానే కనిపిస్తోంది.
స్టీవ్ స్మిత్ సేన ప్లే ఆఫ్ ఆశలు నిలిచేనా?
ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ మ్యాచులో గెలుపొంది తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలగా ఉంది. బెన్ స్టోక్స్ ఫాంలోకి రావడం ఈ జట్టుకు కలిసివచ్చే అంశం. సంజూ శామ్సన్, జోస్ బట్లర్ కూడా రాణిస్తున్నారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా నిలకడగానే రాణిస్తున్నాడు. అయితే బౌలింగ్ విభాగం అంతంత మాత్రంగానే ప్రభావితం చూపుతోంది. కాగా, గెలుపు కోసం ఈ రెండు జట్లు కూడా విజయం కోసం తుదివరకు శ్రమించే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి 7.30గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్షప్రసారం కానుంది.