IPL 2020: ముంబైని కలవరపెడుతున్న లీప్ ఇయర్ సెంటిమెంట్.. సన్రైజర్స్కు ప్లస్ పాయింట్!
హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్ తుది దశకు చేరింది. మరికొద్ది గంటల్లో ప్లే ఆఫ్స్ సమరానికి తెరలేవనుంది. టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్, సెకెండ్ ప్లేసర్ ఢిల్లీ క్యాపిటల్స్ దుబాయ్ వేదికగా జరిగే క్వాలిఫయర్ 1 మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ క్వాలిఫయర్ 1 మ్యాచ్కు ముందు ముంబై ఇండియన్స్ను ఓ సెంటిమెంట్ కలవరపెడుతుండగా.. సన్రైజర్స్ హైదరాబాద్కు మాత్రం ఆశలు రెకెత్తిస్తోందిటేబుల్ టాపర్కు లీప్ ఇయర్ గండం..
ఆ సెంటిమెంట్ ఏంటంటే లీప్ సంవత్సరాల్లో టేబుల్ టాపర్గా ఉన్న జట్లు ప్లే ఆఫ్స్లో రెండు మ్యాచ్లు వరుసగా ఓడి ఇంటి దారి పట్టాయి. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా రెండు సార్లు జరిగింది. ఐపీఎల్లో 2011లో ప్లేఆఫ్ విధానం అమల్లోకి రాగా.. అప్పటి నుంచి ప్రతి లీప్ ఇయర్లో.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ప్లేఆఫ్లో రెండు మ్యాచ్లు ఓడి ఫైనల్ చేరకుండానే నిష్క్రమిస్తోంది. 2012, 2016 సీజన్లలో ఇలాగే జరిగింది.
లీప్ సంవత్సరం అయిన 2012లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) లీగ్ దశలో 22 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తొలి ప్లేఆఫ్ మ్యాచ్లో కోల్కతా చేతిలో ఓడిన ఢిల్లీ.. తర్వాతి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. కోల్కతా, చెన్నై మధ్య ఫైనల్ జరగ్గా.. కోల్కతా టైటిల్ గెలిచింది.లీప్ సవంత్సరం అయిన 2016లోనూ ఇదే కథ రిపీట్ అయింది. గుజరాత్ లయన్స్ 18 పాయింట్లతో లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో.. తర్వాతి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. బెంగళూరుతో జరిగిన ఫైనల్లో గెలిచిన సన్రైజర్స్ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. మరి ఈ ఏడాది ఏం జరుగుతుందో చూడాలి.
సన్రైజర్స్ హైదరాబాద్కు మాత్రం ఈ లీప్ ఇయర్ సెంటిమెంట్ కలిసొస్తుంది. హైదరాబాద్ గెలిచిన టైటిల్ లీప్ ఇయర్ 2016 కావడం విశేషం. ఇప్పటికే ఆ సీజన్ పరిస్థితులు పునరావృతం అవుతుండగా.. టైటిల్ తమదేనని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ లీప్ ఇయర్ సెంటిమెంట్ కూడా అనుకూలంగా ఉండటంతో టైటిల్ గెలవడంపై మరింత ధీమా వ్యక్తం చేస్తున్నారు.