సన్ రైజర్స్ బ్యాట్స్మెన్పై కోహ్లీ స్లెడ్జింగ్: అదృష్టం బాగుండి: టీమిండియా క్రికెటర్పైనే
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ముగింపు దశకు చేరుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస ఓటములను చవి చూసింది. అదృష్టం బాగుండబట్టే ప్లేఆఫ్లోకి అడుగు పెట్టిన రాయల్ ఛాలెంజర్స్.. దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్లోనూ నాసిరకం ఆటతీరును ప్రదర్శించింది. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. మ్యాచ్పై ఏ మాత్రం శ్రద్ధ పెట్టినట్టు కనిపించలేదు. నాకౌట్ మ్యాచ్లో నిర్లక్ష్యంగా ఆడి.. ఓటమిని కొని తెచ్చుకుంది.
స్ఫూర్తినింపలేకపోయిన కేప్టెన్..
వరుస ఓటములతో కుదేల్ అయిన జట్టులో స్ఫూర్తినింపాల్సిన కేప్టెన్ విరాట్ కోహ్లీ.. దానికి భిన్నంగా వ్యవహరించడం వివాదాస్పదమౌతోంది. లీగ్ దశ మ్యాచ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే వరుసగా అయిదింట్లో ఓడిపోయింది రాయల్ ఛాలెంజర్స్. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో శుక్రవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన నాకౌట్ మ్యాచ్లో తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయింది. ఈ లో-స్కోర్ మ్యాచ్ను కాపాడుకోవడానికి కోహ్లీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. సరైన వ్యూహాలను రూపొందించలేకపోయాడు.
తోటి బ్యాట్స్మెన్పైనే స్లెడ్జింగ్..
విరాట్ కోహ్లీ మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యాడు. సన్ రైజర్స్ వన్డౌన్ బ్యాట్స్మెన్ మనీష్ పాండేపై స్లెడ్జింగ్కు దిగాడు. అతణ్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. తోటి టీమిండియా బ్యాట్స్మెన్పైనే స్లెడ్జింగ్కు పాల్పడటం పట్ల అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లే టీమిండియా టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ జట్టుకు మనీష్ పాండే ఎంపికయ్యాడు. తనతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోబోయే క్రికెటర్పైనే స్లెడ్జింగ్కు పాల్పడటాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తప్పుపడుతున్నారు.
ఆజ్ నహీ మార్ రహా షాట్..
సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఇన్నింగ్ మూడో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ అది. సిరాజ్ వేసిన రెండోబంతిని పాండే కవర్స్ వైపు ఆడాడు. అక్కడ ఉన్న మొయిన్ అలీ ఆ బంతిని ఫీల్డ్ చేశాడు. దాన్ని కోహ్లీకి అందించాడు. బంతిని అందుకున్న కోహ్లీ.. మనీష్ పాండే వైపు చూస్తూ బిగ్గరగా నవ్వాడు. బహుత్ బడియా. ఆజ్ నహీ మార్ రహా షాట్.. అచ్ఛా చలో.. అంటూ పాండేను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. ఓపెనర్ గోస్వామి అవుట్ అయిన తరువాత వన్డౌన్గా క్రీజ్లోకి వచ్చిన పాండే..వ్యక్తిగత స్కోర్ ఒక్క రన్ మాత్రమే. అయిదుబంతులను ఆడాడు.
భారీ షాట్లను ఆడకపోవడంతో ఎద్దేవా..
తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోవాల్సి రావడంతో మనీష్ పాండే తాను ఎదుర్కొన్న తొలి బంతులను ఆచితూచి ఆడాడు. భారీ షాట్లను ఆడలేకపోయాడు. ధాటిగా ఆడకపోవడంతో మనీష్ పాండేను ఎద్దేవా చేశాడు కోహ్లీ. ఈ మ్యాచ్లో మనీష్ పాండే.. 21 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్.. మూడు ఫోర్లు ఉన్నాయి. తోటి బ్యాట్స్మెన్లపై విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్కు పాల్పడటం ఇది కొత్తేమీ కాదు. ఇదే ఐపీఎల్-2020 సీజన్లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్పైనా అతను ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.