ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కక్కుర్తి: దుబాయ్ నుంచి వస్తూ వస్తూ: ఎయిర్పోర్టులో భార్యతో సహా
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఆల్రౌండర్ కక్కుర్తి పడ్డాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత దుబాయ్ నుంచి వస్తూ వస్తూ.. దొంగ బంగారాన్ని వెంట తెచ్చుకున్నాడు. కొన్ని విలువైన వస్తువులు, వాచీలను అక్రమంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అధికారుల కంట పడకుండా దాచి పెట్టి మరీ వాటిని దుబాయ్ నుంచి తీసుకొచ్చాడు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అతణ్ని తనిఖీ చేయగా.. అసలు విషయం బయటపడింది. అధికారులు ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు.
రెండురోజుల తరువాత స్వదేశానికి..
ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్తో మంగళవారం రాత్రి ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మధ్య ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం జట్టు సభ్యులు చాలా మంది రెండు రోజుల పాటు దుబాయ్లోనే గడిపారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన క్రికెటర్లు ఫైనల్ ముగిసిన వెంటనే స్వదేశానికి చేరుకోగా.. మిగిలిన వారు అక్కడే ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేశారు.ఈ సందర్భ:గా కృనాల్ పాండ్యా తన భార్య పంఖూరి శర్మతో కలిసి దుబాయ్లో భారీ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేశాడు.
వాచీల విలువ రూ. 75 లక్షలు..
కొన్ని విలువైన వస్తువులు, నాలుగు వాచీలను కొన్నాడు. రెండు రోలెక్స్, రెండు అడెమార్ పిగుయోట్ రిస్ట్ వాచీలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటి విలువ 75 లక్షల రూపాయలు. విలువై వస్తవులను తమతో పాటు తీసుకుని దేశాలను దాటే సమయంలో అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అవసరమైన పన్నులను చెల్లించాల్సి ఉంటుంది. కృనాల్ పాండ్యా అవేవీ చేయలేదు. బంగారాన్ని వాచీలను అధికారుల కంట పడకుండా దాచి పెట్టుకుని మరీ తీసుకొచ్చాడు. గురువారం రాత్రి ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టాడు.
నాలుగు గంటల పాటు కస్టడీలో..
ఈ సందర్భంగా అధికారులు అతణ్ని తనిఖీ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులను కృనాల్ పాండ్య, అతని భార్య పంఖూరి శర్మను అదుపులోకి తీసుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు వారిని విచారించారు. అక్రమంగా బంగారాన్ని తరలించడానికి ప్రయత్నించిన కారణంగా అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కస్టమ్స్ అధికారులకు బదలాయించారు. కృనాల్ పాండ్యా వద్ద లభించిన విలువైన వస్తువులు, వాచీల గురించి అంచనా వేశాడు. భారతీయ కరెన్సీలో ఆ నాలుగు వాచీల విలువ 75 లక్షల రూపాయలుగా తేలినట్లు అధికారులు వెల్లడించారు.
Recommended Video
స్థాయికి తగ్గట్టుగ ఆడలేని ఆల్రౌండర్
ఈ సీజన్లో కృనాల్ పాండ్యా అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోయాడు. 16 మ్యాచులను ఆడిన అతను 109 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 34 పరుగులు. బౌలింగ్లోనూ అంతంత మాత్రమే. 16 మ్యాచుల్లో ఆరు వికెట్లను పడగొట్టగలిగాడంతే. జట్టు వరుసగా విజయాలను సాధిస్తుండటంతో కృనాల్ పాండ్యా వంటి టాప్ రేటెడ్ క్రికెటర్ల వైఫల్యాలు చర్చలోకి రాలేదు. వారి ఫెయిల్యూర్స్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.