IPL 2020: ముంబై వర్సెస్ రాజస్థాన్, స్మిత్పై రోహిత్ పైచేయి సాధిస్తాడా?
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ20 2020లో మంగళవారం కీలక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మంచి ఫాంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుతో జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రెండు జట్లలోనూ మంచి బ్యాట్స్మన్, బౌలర్లు ఉన్నారు.
ఇరు జట్లూ విజయాల బాటలోనే..
అయితే, ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ జట్టు మూడింటిలో విజయం సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలను నమోదు చేసింది.
రాజస్థాన్ రాయల్స్లో కీలక బ్యాట్స్మెన్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్కు ముంబై ఇండియన్స్ జట్టుపై మంచి రికార్డు ఉంది. అయినప్పటికీ మంగళవారం జరిగే మ్యాచ్ రాజస్థాన్కు అంత సులభమేమీ కాకపోవచ్చు. కాగా, సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్లతో రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది. వీరంతా కూడా ముంబై బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. స్మిత్, జోస్ బట్లర్, శాంసన్, ఊతప్ప, రియాన్లు బ్యాట్ ఝులిపిస్తే రాజస్థాన్ జట్టుకు విజయం ఖాయంగానే కనిపిస్తోంది. కాగా, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఇప్పటికే జట్టుకు అందుబాటులోకి రాకపోవడం ఈ జట్టుకు లోటనే చెప్పవచ్చు.
ముంబై కీలక ఆటగాళ్లు.. స్మిత్పై రోహిత్ పైచేయి సాధిస్తాడా?
ఇక రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై జట్టు కూడా పటిష్టంగానే ఉంది. క్వింటన్ డికాక్, రోహిత్ శర్మలు తమ బ్యాటుకు పనిచేబితే పరుగుల వరద పారుతుంది. అంతేగాక, పాండ్యా సోదరులు, కీరన్ పోలార్డ్లు కూడా తమదైన సమయంలో బ్యాటుతో రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రత్యర్థుల చేతుల్లో నుంచి మ్యాచులను లాగేసుకోగలరు. మంగళవారం జరిగే ఈ మ్యాచ్ ఉత్కంఠగానే కొనసాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మంగళవారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యక్షప్రసారం కానుంది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్మిత్ సేనపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పైచేయి సాధిస్తాడా? అనేది మంగళవారం తేలనుంది.