రోహిత్ శర్మ కోసం ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ వికెట్ బలి: 11వ ఓవర్లో హైడ్రామా
దుబాయ్: డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచింది. ఐపీఎల్-2020 టైటిల్ను ఎగరేసుకెళ్లింది. ఐపీఎల్ కప్ను రోహిత్ శర్మ టీమ్ ముద్దాడటం వరుసగా ఇది రెండోసారి. ఐపీఎల్-2019 సీజన్ విజేతగా నిలిచిన ఈ జట్టు ఆ ఛాంపియన్ టైటిల్ను నిలబెట్టుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ను ఓడించింది. అయిదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొత్తంగా అయిదో సారి ఛాంపియన్గా ఆవిర్భవించింది.
అంచనాలను అందుకోలేని ఢిల్లీ..
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్.. 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 157 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లెవరూ రాణించలేేకపోయారు. ఓపెనర్లు మార్కస్ స్టోయినిస్ తాను ఎదుర్కొన్న తొలిబంతికే అవుట్ అయ్యాడు. వన్డౌన్ బ్యాట్స్మెన్ అజింక్యా రహానే మరోసారి నిరాశపరిచాడు. రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. మూడు ఫోర్లతో దూకుడు మీదున్నప్పటికీ.. శిఖర్ ధావన్ ఎక్కువ సేపు క్రీజ్లో కుదురుకోలేకపోయాడు. స్పిన్నర్ జయంత్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిడిలార్డర్లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు.
ముంబై స్టైల్లో..
157 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్కు దిగిన ముంబై ఇండియన్స్.. ఎప్పట్లాగే తన స్టైల్లోనే ఇన్నింగ్ను ఆరంభించింది. కేప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్-ఓపెనర్ క్వింటన్ డీకాక్ దూకుడుగా ఆడారు. భారీ షాట్లు ఆడారు. డికాక్.. 12 బంతుల్లో 20 పరుగులు చేసి, అవుట్ అయ్యాడు. ఇందులో ఒక సిక్సక్.. మూడు ఫోర్లు ఉన్నాయి. వన్డౌన్గా క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడాడు. స్ట్రైక్ రొటేట్ చేశాడు. భారీ షాట్లు ఆడుతోన్న రోహిత్ శర్మకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ కల్పించాడు.
కేప్టెన్ కోసం వికెట్ త్యాగం..
సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. కేప్టెన్ కోసం అతను తన వికెట్ను త్యాగం చేశాడు. నిర్లక్ష్యంగా ఆడిన రోహిత్ శర్మ అవుట్ కాకుండా కాపాడుకున్నాడు. అతనికి బదులుగా తాను పెవిలియన్ దారి పట్టాడు. 20 బంతుల్లో ఒక సిక్సర్, ఒక ఫోర్తో 20 పరుగులు చేసిన క్రీజ్కు కుదురుకున్న సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మ నిర్లక్ష్యానికి అవుట్ అయ్యాడు. 11వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేశాడు.
అయిదో బంతికి హైడ్రామా..
ఆ ఓవర్ అయిదో బంతిని ఎదుర్కొన్న రోహిత్ శర్మ బ్యాక్ఫుట్ షాట్ ఆడాడు. కవర్స్లో ఉన్న ప్రవీణ్ దుబే దూసుకెళ్లిందా బంతి. అదే సమయంలో రోహిత్ శర్మ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు రన్ తీశాడు. లేని పరుగు అది. నాన్ స్ట్రైకర్ ఎండ్ మీదుగా వెళ్తోన్న ఆ బంతిని చూసిన సూర్యకుమార్ యాదవ్.. నో అంటూ రోహిత్ శర్మను వారించాడు. అప్పటికే అతను నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు హాఫ్ పిచ్ను దాటుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ నుంచి కదలకపోతే.. రోహిత్ శర్మ రనౌట్ అవుతాడు. అప్పటికే ప్రవీణ్ దుబే.. ఆ బంతిని అందుకుని వికెట్ కీపర్ వైపు విసిరేశాడు. దాన్ని గమనించిన సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవుతానని తెలిసినా.. స్ట్రైకింగ్ ఎండ్ వైపు కదిలాడు. కీపర్ బంతితో బెయిల్స్ను గిరాటేయడంతో పెవిలియన్ దారి పట్టాడు.
నిరాశతో రోహిత్..
సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో రోహిత్ శర్మ నిరాశకు గురయ్యాడు. కొద్దిసేపు మోకాళ్ల మీద కూర్చుండిపోయాడు. అప్పటికి జట్టు స్కోరు 90. చివరి ఓవర్లలో ముంబై ఇండియన్స్ వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. 137 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. మరో 10 రన్లకు కీరన్ పొల్లార్డ్ అవుట్ అయినప్పటికీ.. ఓవర్లు మిగిలి ఉండటం, ఛేదించాల్సిన స్కోర్ భారీగా లేకపోవడంతో పెద్దగా ఆందోళన పడలేదు.