నో చీర్ గర్ల్స్..నో ఆడియన్స్: బట్.. అదే ఎఫెక్ట్: క్రికెట్ హిస్టరీలో ఫస్ట్టైమ్
ఐపీఎల్.. క్రికెట్ ప్రేమికులను కట్టి పడేసే మెగా టోర్నమెంట్. కోట్లాదిమందిని టీవీలకు అతుక్కుపోయే టోర్నీ. ఫుట్బాల్ తరువాత ఆ స్థాయిలో స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే వారిని సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే కెపాసిటీ ఉంది దీనికి. ఐపీఎల్ మ్యాచ్లు ఆరంభమౌతున్నాయంటే.. దాని కథే వేరుగా ఉంటుంది. కళ్లు మిరుమిట్లు గొలిపే క్రాకర్స్..కిరాక్ పుట్టిస్తాయి. చీర్ గర్ల్స్ జోష్.. కొత్త ఊపును తీసుకొస్తుంది. అన్నింటికీ మించి- స్టేడియంలో ప్రేక్షకుడు కొట్టే చప్పట్లు.. వేసే ఈలలు, కేకలు.. ప్లకార్డుల ప్రదర్శన.. ఇవన్నీ ఈ మెగా టోర్నమెంట్కు ఎక్స్ట్రా అట్రాక్షన్.
బోసిపోయిన స్టేడియం..
బ్యాట్ నుంచి ఓ బౌండరీ జాలువారినా, బౌలర్ నుంచి నిప్పులు చెరిగే బంతి ధాటికి వికెట్ గాల్లోకి ఎగిరినా.. ప్రేక్షకుడి ఆనందానికి హద్దులే ఉండవు. బాల్ టు బాల్.. కేరింతలు కొట్టే సన్నివేశాలు సర్వసాధారణం ఐపీఎల్ టోర్నీలో. ఈ సారి అలాంటి దృశ్యాలేవీ కనిపించట్లేదు. స్టేడియం మూగబోయింది. టోర్నమెంట్ బోసి పోయింది. స్టేడియంలో ప్రేక్షకుడనేవాడే లేడు. చీర్ గర్ల్స్ లేరు.. వారి మెరుపులూ లేవు. బాల్ బౌండరీ దాటినా, వికెట్ నేలకూలినా స్టేడియంలో ఎలాంటి జోష్ లేదు. టెర్నీ కూడా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఆరంభమైంది.
మాయదారి కరోనా వైరస్ దెబ్బకు..
దీనికి కారణమేంటనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. మాయదారి కరోనా వైరస్ ఎఫెక్ట్ ఐపీఎల్ టోర్నమెంట్పై తీవ్రంగా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఈ సారి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు. ఒక్క టికెట్ కూడా చిరగలేదు. స్టేడియం మొత్తం ఖాళీగా కనిపించింది. బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ, ప్లేయర్లు, ఫ్రాంఛైజీల సిబ్బంది స్టేడియం మొత్తం మీద కనిపించింది వారే. ఒక్క ప్రేక్షకుడు కూడా లేకుండా ఓ మెగా క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతుండటం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఆ మాటకొస్తే.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా చెప్పుకోవచ్చు.
Recommended Video
స్పెషల్ ఎఫెక్ట్స్
అయినప్పటికీ.. టీవీ చూసే ప్రేక్షకుడికి ఆ లోటు కనిపించనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు. స్పెషల్ ఎఫెక్ట్స్ను సమకూర్చారు. బంతి బంతికీ ప్రేక్షకుల కేరింతలకు సంబంధించిన ఆడియో మిక్సింగ్ను టెలికాస్ట్ చేశారు. ఇది కాస్తా.. స్టేడియంలో జనం ఉన్న ఫీలింగ్ను కలిగించింది. బ్యాట్స్మెన్ భారీ షాట్ కొట్టినప్పుడు మాత్రమే కాదు.. బంతి బంతికీ ప్రేక్షకుల ఉత్సాహానికి సంబంధించిన ఈ ఆడియో మిక్సింగ్ను నిర్వాహకులు ప్రసారం చేశారు. ఫలితంగా- జనం లేరనే భావనను టీవీక్షకుల్లో కలగకుండా జాగ్రత్తలను తీసుకున్నారు.