IPL 2020: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, శ్రేయాస్ టాప్ ర్యాంక్ సాధించేనా?
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టీ20లో శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రెండు జట్లు కూడా బలంగానే కనిపిస్తున్నప్పటికీ.. ఆట తీరులో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మెరుగ్గా ఉంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ మాత్రం చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
రాజస్థాన్ కంటే డిల్లీ మెరుగ్గా..
ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమిపాలు కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును 59 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్ కంటే చాలా మెరుగ్గా ఉందని చెప్పవచ్చు.బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఢిల్లీ జట్టు మంచి ప్రదర్శనను కనబరుస్తోంది.
ఆ రెండు మ్యాచులు తప్ప..
ఐపీఎల్ 2020లో 216/7, 226/6, 137/9, 154/6, 136 స్కోర్లను నమోదు చేసింది. ఐదు మ్యాచులు ఆడిన రాజస్థాన్.. కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల్లో స్టీవ్ స్మిత్, సంజూ శామ్సన్ బాగా ఆడారు. ఆ తర్వాత జోష్ బట్లర్ కూడా ఇప్పుడు తన ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. అయితే, మిగితా ఆటగాళ్లు మాత్రం అంతగా రాణించడం లేదు.
టాప్ ర్యాంకుపై కన్నేసిన శ్రేయాస్
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో ఉత్తమమైన ప్రదర్శన చేస్తోంది. పృథ్వీషా, శిఖర్ ధావన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయిన్స్ లు రాణిస్తున్నారు. పాయింట్ల పట్టకలో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ తర్వాత స్థానంలో ఢిల్లీ జట్టు ఉంది. రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచులో విజయం సాధిస్తే టాప్ ర్యాంక్కు చేరుకునే అవకాశం ఉంది. కాగా, రాజస్థాన్, ఢిల్లీ మ్యాచ్ షార్జా స్టేడియంలో శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.