ధోనీ ఎక్కడ.. రిషబ్ పంత్ ఎక్కడ: ఎప్పటికీ అలా కాలేడు: గంభీర్
ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించి పెట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించిన ఘనత ఒక్క ధోనీకే దక్కుతుంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ తర్వాత పదివేల పరుగులు సాధించిన ఆటగాడిగా మహీ వన్డేల్లో భారత ఆల్ టైమ్ రన్ స్కోరర్స్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక వికెట్ కీపర్గా వ్యక్తిగతంగా నమోదు చేసిన రికార్డుల్లోనూ అతడికి అతడే సాటి. ఐపీఎల్ 2020 కంటే ముందే ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. అతడి స్థానాన్ని భర్తీ చేయగలిగే వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కోసం టీమిండియా వెతుకుతోంది.
ఎంఎస్ ధోనీ ఆటకు గుడ్బై చెప్పిన తర్వాత.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఎవరన్న అంశంపై క్రీడా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. అలాంటి తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ ఆటగాడు రిషబ్ పంత్ అందరి దృష్టిని ఆకర్షించాడు. పొట్టి ఫార్మాట్లో మెరుగ్గా రాణించిన ఈ ఢిల్లీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అనతికాలంలోనే జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెలక్టర్ల నిర్ణయం సరైందని నిరూపించాడు. ధోనీ వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు.
అప్పటి నుంచి రిషబ్ పంత్ను ఎంఎస్ ధోనీతో పోల్చడం పరిపాటిగా మారింది. కానీ గత కొంతకాలంగా పంత్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. 2019, 2020ల్లో పంత్ ఆకట్టునే ఆటతీరు కనబర్చలేకపోతున్నాడు. బ్యాట్తో చెలరేగలేకపోయిన పంత్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టులో చోటు కోల్పోయాడు. వికెట్ కీపర్ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేయడంతో మెల్లగా అతడికి అవకాశకాలు సన్నగిల్లాయి. ఇక ఐపీఎల్ 2020లో పంత్ సత్తా చాటుతాడని భావించగా.. అది జరగలేదు. ఈ నేపథ్యంలోనే పంత్ను ధోనీ పోల్చడం మానుకోవాలని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మీడియాకు సూచించాడు.
'రిషబ్ పంత్ ఎప్పటికీ ఎంఎస్ ధోనీ కాలేడు. అతడిని రిషబ్ పంత్గానే ఉండనివ్వండి. మీడియా ఈ పోలిక గురించి మాట్లాడినంత కాలం.. పంత్ సైతం తనకు అవకాశాలు వస్తాయని భావిస్తూనే ఉంటాడు. ఎంఎస్ ధోనీలాగా సిక్సర్లు కొట్టినంత మాత్రాన ఎవరూ మహీలా అయిపోరు. పంత్ తన ఆటతీరును ఇంకా మెరుగపరచుకోవాల్సి ఉంది. కీపింగ్, బ్యాటింగ్పై దృష్టి సారించాల్సిన అవశ్యకత ఉంది' అని ఢిల్లీ ఎంపీ గంభీర్ సూచించాడు.
ఈ ఐపీఎల్ 2020 ఆరంభంలో సంజూ శాంసన్ విషయంలో గౌతమ్ గంభీర్ స్పందించిన విషయం తెలిసిందే. శాంసన్ వరుసగా రెండు మ్యాచ్ల్లో చెలరేగాడు. దీంతో కాంగ్రెస్ నేత శశిథరూర్ అతణ్ని ధోనీ వారసుడంటూ కొనియాడారు. అప్పుడు కూడా గంభీర్ ఇలాగే స్పందించాడు. అతడు ఎప్పటికీ సంజూ శాంసనే.. వేరే ఎవరో కావాల్సిన అవసరం లేదన్నాడు. ఇప్పుడు పంత్ విషయంలోనూ ఇలానే అన్నాడు. నిజానికి గంభీర్ ఎప్పుడూ మహీపై విమర్శలు చేస్తాడన్న విషయం తెలిసిందే.