IPL 2020: 200 మ్యాచులు ఆడి రికార్డ్ సృష్టించిన రోహిత్.. ధోనీ తర్వాత..!
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ మ్యాచ్తో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. హిట్ మ్యాన్కు ఇది 200వ ఐపీఎల్ మ్యాచ్ కాగా.. ఈ ఘనతను అందుకున్న రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రోహిత్ కన్నా ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఇద్దరు మినహా మరే ఆటగాడు ఐపీఎల్లో 200 మ్యాచ్లు ఆడలేదు. ఇక 199 ఇన్నింగ్స్ల్లో 1 సెంచరీ, 38 హాఫ్ సెంచరీలతో హిట్ మ్యాన్ 5162 రన్స్ చేశాడు. స్ట్రైక్రేట్ 130.6 ఉండటం విశేషం.
ఈ ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ మంచి శుభారంభాన్ని అందుకుంది. ఆదిలోనే ఢిల్లీ టాప్ 3 బ్యాట్స్మెన్ను పెవిలియన్కు చేర్చింది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే మార్కస్ స్టాయినీస్(0) వికెట్ కీపర్ క్వింటన్ డికాక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతని తర్వాతి ఓవర్లో రహానె(2) కూడా వెనుదిరిగాడు. జయంత్ యాదవ్ వేసిన నాలుగో ఓవర్లో సూపర్ ఫామ్లో ఉన్న శిఖర్ ధావన్(15) బౌల్డ్ అయ్యాడు. దాంతో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక టాస్ ఓడిపోవడంపై రోహిత్ కూడా విభిన్నంగా స్పందించాడు. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదన్నాడు. 'నిజాయితిగా చెప్పాలంటే నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. టాస్ ఓడిపోతానని ఏ మాత్రం ఊహించలేదు. ఈ వికెట్ బ్యాటింగ్కు అనుకూలం. అయితే మేం బౌలింగ్లో మంచి ఆరంభాన్ని అందుకుంటే పరిస్థితులు మాకు అనుకూలంగా ఉంటాయి. ఇక మరో ఫైనల్ ఆడటంపై సంతోషంగా ఉంది. అయితే గతం ఇక్కడ అనవసరం. ఇక ఫైనల్ గేమ్ ఒత్తిడి ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది.
అయితే మా ఆటగాళ్లు ఇలాంటి ఒత్తిడిని ఇంతకు ముందు కూడా పేస్ చేశారు. వారు పరిస్థితులను అర్థం చేసుకోగలరు. మేం దీన్ని ఓ మాములు మ్యాచ్గానే ఫీలవుతున్నాం. మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేస్తాం. ప్రతీ ఒక్కరూ ఫిట్గా ఉన్నారు. కానీ ఓ టాక్టికల్ చేంజ్ చేశాం. ఢిల్లీలో లెఫ్టార్మ్ బ్యాట్స్మన్ ఎక్కువగా ఉండటంతో రాహుల్ చాహర్ స్థానంలో జయంత్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకున్నాం. రాహుల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతన్నిపక్కన పెట్టడం బాధగా ఉంది. కానీ జయంత్ యాదవ్ కూడా క్వాలిటీ బౌలరే.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.