IPL 2020: ఫైనల్ ముందు ట్రెంట్ బౌల్ట్కు గాయం.. రోహిత్ శర్మకు కొత్త టెన్షన్
దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ ముంగిట ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ గాయం ఆ జట్టు అభిమానులను కలవరపెడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో గత గురువారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా.. ట్రెంట్ బౌల్ట్ తొడ కండరాలకి గాయమైంది. దాంతో.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన బౌల్ట్.. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి రాలేదు. దాంతో ఈ కివీస్ పేసర్ కీలక ఫైనల్ మ్యాచ్ ఆడుతాడా? లేదా? అనే సందేహం నెలకొంది. అయితే బౌల్ట్ గాయంపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా అప్డేట్ ఇచ్చాడు.
ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన వర్చువల్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న హిట్ మ్యాన్.. ట్రెంట్ బౌల్ట్ ఫిట్గా ఉన్నాడని ఖచ్చితంగా ఫైనల్ ఆడుతాడని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. 'ట్రెంట్ బౌల్ట్ సోమవారం ప్రాక్టీస్ సెషన్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. గత రెండు రోజులుగా గాయం నుంచి అతను పూర్తిగా కోలుకున్నట్లు అనిపించింది. ఫైనల్లో అతను ఆడుతాడనే ఆశిస్తున్నా'అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్తోనే జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన బౌల్ట్ 9 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసాడు. మరీ ముఖ్యంగా.. తొలి ఓవర్లోనే ఆ రెండు వికెట్లూ పడగొట్టడం గమనార్హం. అది కూడా పరుగుల ఖాతా తెరవనీయకుండా పృథ్వీ షా, అజింక్యా రహానేలను పెవిలియన్ చేర్చి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఆ మ్యాచ్లో ముంబై 57 పరుగుల తేడాతో విజయాన్ని అందుకొని టైటిల్ ఫైట్కు సిద్దమైంది. దాంతో ఫైనల్లో కూడా అతను కీలకం కానున్నాడు.
ఐపీఎల్ 2020 సీజన్లో ఇప్పటి వరకూ 14 మ్యాచ్లాడిన ట్రెంట్ బౌల్ట్ 19.40 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. తాజా సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ 29 వికెట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. ముంబై జట్టుకే చెందిన జస్ప్రీత్ బుమ్రా 27 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి తర్వాత 22 వికెట్లతో బౌల్ట్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లీగ్ దశలో రెండు మ్యాచ్లతో పాటు క్వాలిఫయర్-1 మ్యాచ్లోనూ ట్రెంట్ బౌల్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు.