IPL 2020: రాజస్థాన్ రాయల్స్ పై విజయంతో సజీవంగా సన్రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు
దుబాయ్: సన్రైజర్స్ వరుస ఓటమి తర్వాత తిరిగి గాడిలో పడింది. ఇటు బౌలింగ్లోను అటు బ్యాటింగ్లోనూ ఆరెంజ్ ఆర్మీ సత్తా చాటింది. గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మొదట సన్రైజర్స్ పేసర్ జాసన్ హోల్డర్ దెబ్బకు 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసిన రాజస్థాన్.. ఆపై బౌలింగ్లో కూడా తేలిపోయింది. చేజింగ్లో సన్రైజర్స్ 18.1 ఓవర్లలో విజయం సాధించింది. మనీష్ పాండే 47 బంతుల్లో 83 పరుగులు చేసి అజేయంగా నిలువగా మరో బ్యాట్స్మెన్ విజయ్ శంకర్ 51 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
మనీష్ పాండే, విజయ్ శంకర్ ఇద్దరూ చివరి వరకు క్రీజులో ఉండి సన్రైజర్స్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ క్రమంలోనే 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సన్రైజర్స్ తరఫున ఇది 24వ శతక భాగస్వామ్యం. అయితే సన్రైజర్స్ చరిత్రలో ఇద్దరు భారత బ్యాట్స్మెన్ శతక భాగస్వామ్య పరుగులు చేయడం ఇదే తొలిసారి. 2013 తర్వాత హైదరాబాద్ ఆటగాళ్లు 23 సార్లు శతక భాగస్వామ్యాలు చేసినా.. అందులో ఒక విదేశీ ఆటగాడు ఉన్నాడు. దీంతో మనీష్, విజయ్ కొత్త రికార్డు నెలకొల్పారు. 2013లో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో పార్థీవ్ పటేల్, శిఖర్ ధావన్ తొలి వికెట్కు 89 పరుగులు జోడించారు.
విజయ్ శంకర్ 2018 సీజన్లో చివరిసారి అర్ధ శతకం బాదాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఆడిన శంకర్.. చెన్నై చెన్నై సూపర్ కింగ్స్ టీంతో తలపడిన మ్యాచ్లో 54 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే ఆ మ్యాచులో ధోనీసేన విజయం సాధించింది. గతేడాది నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న విజయ్.. ఇప్పుడు మళ్లీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2020 ఆరంభం నుంచి విఫలమయిన విజయ్.. చివరకు ఓ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
గత కొంతకాలంగా సన్రైజర్స్ జట్టు ఎక్కువగా టాప్ ఆర్డర్పై ఆధారపడుతోంది. గతంలో డేవిడ్ వార్నర్-శిఖర్ ధావన్.. ఇప్పుడు డేవిస్ వార్నర్-జానీ బెయిర్స్టో జట్టుకు శుభారంభాలు ఇస్తున్నారు. వీరే ఎక్కువ ఓవర్లు ఆడుతున్నారు. ఇక నాలుగో స్థానంలో కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో భారత క్రికెటర్లలో మూడో స్థానంలో ఆడే మనీష్ పాండేకు మాత్రమే ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటోంది. అయితే విలియమ్సన్ గాయం కారణంగా రాజస్థాన్తో మ్యాచ్ ఆడలేదు. దీంతో నాలుగో స్థానంలో ఆడే అవకాశం శంకర్కు దక్కింది. రికార్డు నమోదయింది.
ఈ మ్యాచ్లో 47 బంతుల్లో 83 పరుగులు చేసిన మనీశ్ పాండేకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. దీంతో ఆరేళ్ల తరువాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పాండే అందుకున్నాడు. అంతేకాదు స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ, సురేష్ రైనాల సరసన చేరాడు. భారత ఆటగాళ్లు అయిన రోహిత్, రైనాలు భారత్, దక్షిణాఫ్రికా, యూఏఈలో జరిగిన ఐపీఎల్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు.
మొత్తానికి గురువారం రాత్రి జరగిన మ్యాచ్తో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించడమే కాకుండా తన నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకుని సన్రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.