బంతిని ఆపబోయి..బౌండరీలోకి విసిరేసి: హైదరాబాద్ ఫీల్డర్ కామెడీ ఎర్రర్: నవ్వాలో, ఏడవాలో
దుబాయ్: బ్యాట్స్మెన్ కొట్టిన షాట్కు బుల్లెట్లా బౌండరీ లైన్ వద్దకు దూసుకెళ్లే బంతులను ఆపడానికి సర్కార్ ఫీట్స్ చేస్తుంటారు ఫీల్డర్లు. బంతిని బౌండరీ లైన్ దాటకుండా ఫీల్డింగ్ విన్యాసాలను ప్రదర్శిస్తుంటారు. మెరుపులు మెరిపిస్తుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నమెంట్లలో ఇలాంటివి ప్రతి మ్యాచ్లోనూ కనిపిస్తుంటాయి. గేమ్ను మరింత ఆసక్తి కలిగిస్తుంటాయి. దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించాడో ఫీల్డర్. బంతిని ఆపే ప్రయత్నంలో అతను చేసిన ఫీట్.. కామెడీ ఎర్రర్గా క్రికెట్ హిస్టరీలో నిలిచిపోతుంది.
Recommended Video
బంతిని ఆపబోయి..
శనివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాటింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ ఇన్నింగ్ అయిదో ఓవర్ వేశాడు. అప్పటికి పంజాబ్ జట్టు స్కోరు 33 పరుగులు. అయిదో బంతిని మన్దీప్ సింగ్ భారీ షాట్ ఆడాడు. బుల్లెట్ వేగంతో ఆ బంతి బౌండరీ లైన్ వైపు దూసుకెళ్లింది. అక్కడే కాచుకుని ఉన్న ఫీల్డర్ అబ్దుల్ సమద్.. బౌండరీ లైన్ వద్ద ఆ బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. బంతిని తన చేతుల్లోకి కూడా తీసుకున్నాడు. అదే ఊపుతో వికెట్ కీపర్ వైపు విసరబోగా.. అది కాస్తా చేతుల్లో నుంచి జారింది. బౌండరీ లైన్కు అవతల పడింది. తన చేతులతో తానే ఫోర్ను ఇచ్చినట్టయింది.
వైరల్గా వీడియో క్లిప్..
అబ్దుల్ సమద్ చేసిన ఆ పొరపాటుకు నవ్వాలో, ఏడవాలో తెలియదన్నట్లుగా ముఖం పెట్టేశారు సన్రైజర్స్ హైదరాబాద్ ఫీల్డర్లు. బౌలర్ సందీప్ శర్మ, కేప్టెన్ డేవిడ్ వార్నర్ అసహనంతో కనిపించారు కొస్సేపు. వారిద్దరూ చిరాకుగా మొఖం పెట్టారు. ఈ ఘటన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ డ్రెస్సింగ్ రూమ్లో నవ్వులు కురిపించింది. డగౌట్లో ఉన్న పంజాబ్ బ్యాట్స్మెన్లు చప్పట్లు కొడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్గా మారింది. దీన్ని కామియో ఎర్రర్గా దీన్ని అభివర్ణిస్తున్నారు క్రికెట్ ప్రేమికులు.
ఆల్రౌండర్ హోదాలో
జమ్మూకాశ్మీర్కు చెందిన అబ్దుల్ సమద్కు ఆల్రౌండర్ కేటగిరీలోకి తీసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ. ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాడతను. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఏడుపరుగులే చేశాడు. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్లను ఆడిన అతను 78 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో ఒక వికెట్ పడగొట్టాడు. సమద్ బ్యాటింగ్ సగటు 19.50. ఐపీఎల్లో ఇదే అతనికి తొలి సీజన్. ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో రాణించినప్పటికీ.. ఐపీఎల్లో అడుగు పెట్టేసరికి తడబాటు అతణ్ని వెంటాడుతోంది. ఫలితంగా దారుణంగా విఫలమౌతున్నాడు. తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాడు.
12 పరుగుల తేడాతో..
ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. 126 పరుగుల లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. 114 పరుగులకే కుప్పకూలిపోయింది. చివరి ఏడు వికెట్లను 14 పరుగుల తేడాతో కోల్పోయింది. ఈ విజయంతో పంజాబ్ జట్టు టాప్-5లోకి చేరుకోగా.. హైదరాబాద్ స్థానం మరింత దిగజారింది. ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ బౌలర్లు క్రిస్ జోర్డాన్, అక్ష్దీప్ సింగ్ చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. హైదరాబాద్ జట్టుకు విజయాన్ని దూరం చేశారు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి, మూడు వికెట్లను పడగొట్టిన క్రిస్ జోర్డాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.