పాతకథే: పాతాళంలోకి సన్రైజర్స్: చివరి 7 వికెట్లను ఎలా కోల్పోయిందంటే: కొత్తేమీ కాదు..కానీ
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో మరో లోయెస్ట్ స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్ ముగిసింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన పోరులో ఆధిపత్యం బౌలర్లదే. పంజాబ్ కింగ్స్ను అతి తక్కువ పరుగులకు కట్టడి చేసిన సన్రైజర్స్.. అంతకంటే తక్కువ స్కోరుకే చతికిల పడింది. అసలే సరైన మిడిలార్డర్ బ్యాట్స్మెన్ లేక సతమతమౌతోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్ను దారుణంగా దెబ్బకొట్టింది పంజాబ్. టోర్నమెంట్ ఆరంభంలో వరుస పరాజయాలను ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్.. వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ప్లేఆఫ్ రేసులో నిలిచింది.
తక్కువ స్కోరును కూడా అందుకోలేక..
ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్లో భాగంగా శనివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీమ్ 126 పరుగులే చేయగా.. ఆ మాత్రం స్కోర్ను కూడా అందుకోలేకపోయింది హైదరాబాద్. 114 పరుగులకు కుప్పకూలిపోయింది. ప్లేఆఫ్ అవకాశాలను చేతులారా పోగొట్టుకుంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని హైదరాబాద్ టీమ్.. ఇక ప్లేఆఫ్ దశకు చేరుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. వార్నర్-బెయిర్స్టో జోడీ అందించిన అద్భుత ఆరంభాన్ని ఏ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయిందా టీమ్.
గెలవాల్సిన మ్యాచ్లోనూ..
నిజానికి- ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. హైదరాబాద్ జట్టు తొలి వికెట్ను కోల్పోయే సమయానికి జట్టు స్కోరు 56 పరుగులు. 6.2 ఓవర్లలోనే ఆ స్కోర్ను సాధించింది. ఐపీఎల్ వరకు అదో అద్భుత ఆరంభం. తొమ్మిది వికెట్లు చేతుల్లో పెట్టుకుని 14 ఓవర్లలో 71 పరుగులను చేయడం ఓ ప్రొఫెషనల్ టీమ్కు మంచినీళ్లు తాగినంత సులభం. అలా జరగలేదు. జట్టు స్కోరు 114 పరుగులకు చేరుకునే సరికి టీమ్ మొత్తం డగౌట్లో వచ్చి కూర్చుందంటే.. దాని ఆటతీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
14 పరుగులకు చివరి ఏడు వికెట్లు..
హైదరాబాద్ జట్టు 14 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. 100 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడగా.. ఇక బ్రేక్ అనేదే పడలేదు. స్కోర్బోర్డులో మరో 14 పరుగులు జమ అయ్యే సరికి జట్టు మొత్తం ఆలౌట్ అయింది. మరీ దారుణంగా చివరి నాలుగు వికెట్లను నాలుగు పరుగులకే పడేసుకుంది. టెయిటెండర్లలో ఒక్కరూ ఖాతా తెరవనే లేదు. వారిలో ఏ ఒక్కరు క్రీజ్లో నిలిచి ఉన్నా.. సునాయాసంగా హైదరాబాద్ టీమ్ గెలిచి ఉండేదే. చివరి ఓవర్లలో క్రిస్ జోర్డాన్, అర్ష్దీప్ సింగ్ విజృంభించి బౌలింగ్ చేశారు. మూడు చొప్పున వికెట్లను పడగొట్టారు.
అవమానకరంగా..
14 పరుగులకు చివరి ఏడు వికెట్లను కోల్పోయిన జాబితాలో హైదరాబాద్ చేరింది. తక్కువ పరుగులకు చివరి ఏడు వికెట్లను పారేసుకోవడం హైదరాబాద్కు కొత్తేమీ కాదు. ఐపీఎల్-2019లో ఇంతకంటే దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 10 పరుగులకు చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. అదే ఏడాది ఢిల్లీ కేపిటల్స్ కూడా హైదరాబాద్ చేతిలో ఎనిమిది పరుగులకు చివరి ఏడు వికెట్లను పారేసుకుంది.
ప్లేఆఫ్ ముంగిట..
ఈ ఓటమితో హైదరాబాద్ జట్టు ఇక తిరుగుముఖం పట్టడం దాదాపు ఖాయమైనట్టే. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఈ మెగా టోర్నమెంట్ నుంచి వైదొలగేలా కనిపిస్తోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ ప్లే ఆఫ్ ముగింట నిలిచాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కత నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. అట్టడుగు స్థానంలో ఉన్న పంజాబ్ టీమ్.. వరుసగా నాలుగు విజయాలను సాధించింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి ఎగబాకింది. ఆ జట్టు ఖాతాలో మొత్తం 10 పాయింట్లు ఉన్నాయి. ప్లేఆఫ్ బెర్త్ కోసం కేకేఆర్తో పోటీ పడుతోంది పంజాబ్. ఇంకా మూడు మ్యాచ్లను ఆడాల్సి ఉంది.