ఢిల్లీ కేపిటల్స్ ప్లేఆప్ అవకాశాలకు ఎర్త్ పెట్టిన సన్రైజర్స్: అదే జరిగితే శ్రేయాస్ టీమ్ అవుట్
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్లో మరో అద్భుతం చోటు చేసుకుంది. తన చివరి మ్యాచ్లో 126 పరుగుల లక్ష్యాన్ని కూడా అందుకోలేక చతికిల పడిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఒక్కసారిగా రెచ్చిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో తనకంటే మెరుగ్గా, బలంగా ఉన్న ఢిల్లీ కేపిటల్స్ను చిత్తుచిత్తుగా ఓడించింది. 88 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టాస్ ఓడిపోయి తొలిత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 20 ఓవర్లలో 219 పరుగులను సాధించింది.
ప్లేఆఫ్ ముగింట బోల్తా..
బ్యాటింగ్లో అనూహ్యంగా, అద్భుతంగా రాణించిన డేవిడ్ వార్నర్ టీమ్.. బౌలింగ్లోనూ అదే స్థాయి ప్రదర్శన చేసింది. ప్రత్యర్థి జట్టును 131 పరుగుల వద్దే కట్టడి చేసింది. ఢిల్లీ కేపిటల్స్ జట్టు 19 ఓవర్లలో 131 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు.. ప్లేఆఫ్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకునే దశలో ఢిల్లీ తడబడుతోంది. బోల్తా కొడుతోంది. వరుసగా మూడు మ్యాచ్లల్లో ఓడిపోయింది. హ్యాట్రిక్ ఓటమిని నమోదు చేసింది. ఇంకో రెండు మ్యాచ్లను ఆడాల్సి ఉందా జట్టు. ఈ రెండింట్లో ఏ ఒక్కదాంట్లో గెలిచినా నేరుగా ప్లేఆఫ్కు చేరుకుంటుంది. లేదంటే.. దాని స్థానాన్ని హైదరాబాద్ ఆక్రమించే అవకాశాలు లేకపోలేదు.
ఢిల్లీకి ఎర్త్ పెట్టినట్టే..
ఐపీఎల్-2020 సీజన్లో ఇప్పటిదాకా 12 మ్యాచ్లను ఆడిన ఢిల్లీ కేపిటల్స్ ఏడింట్లో విజయం సాధించింది. 14 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకోవాలంటే 16 పాయింట్లను అందుకోవాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే. ప్లేఆఫ్ చేరే దశలో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ఓటమి అనంతరం పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దిగజారింది. ఇక ఆ జట్టు అకౌంట్లో ఉన్నవి రెండు మ్యాచ్లే.
రెండింట్లో ఒకటి గెలిచినా..
ఈ రెండు మ్యాచ్లూ ఢిల్లీ కేపిటల్స్కు అగ్నిపరీక్ష పెట్టేవే.. జీవన్మరణ సమస్యగా మారినవే. తనతో సమవుజ్జీలుగా ఉన్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లను ఢీకొట్టాల్సి ఉంది. ఈ నెల 31వ తేదీన ముంబై ఇండియన్స్, వచ్చేనెల 2న రాయల్ ఛాలెంజర్స్తో మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో ఏ ఒక్కటి గెలిచినా ఢిల్లీ కేపిటల్స్ నేరుగా ప్లేఆఫ్కు చేరుకుంటుంది. లేదంటే.. తిరుగుముఖం పట్టడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే.. ఢిల్లీ స్థానాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ ఆక్రమించుకోవడం ఖాయం.
హైదరాబాద్కూ అగ్నిపరీక్షే..
ప్రస్తుతం సన్రైజర్స్ కూడా రెండు మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లోనూ సన్రైజర్స్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఏ ఒక్క దాంట్లో ఓడినా.. విమానం పట్టాల్సిందే. ప్లేఆఫ్ రేస్ నుంచి తప్పుకోవాల్సిందే. ఈ దశలో హైదరాబాద్ జట్టు ఈ నెల 31వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వచ్చేనెల 3న ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ రెండింట్లో గెలిస్తే.. హైదరాబాద్ ఖాతాలో 14 పాయింట్ల వచ్చి చేరుతాయి. అయినప్పటికీ ప్లేఆఫ్ అవకాశానికి రెండు పాయింట్ల దూరంలో ఉంటుంది. ఢిల్లీపై ప్రదర్శించిన దూకుడును కొనసాగిస్తుందా? లేదా? అనే దానిమీదే హైదరాబాద్ భవిష్యత్ తేలుతుంది.
బెటర్ రన్రేట్..
ఢిల్లీ కేపిటల్స్ తాను ఆడబోయిే రెండు మ్యాచ్లనూ ఓడిపోతే.. 14 పాయింట్లే ఆగిపోతోంది దాని ప్రస్థానం. అదే సమయంలో హైదరాబాద్ జట్టు తాను ఆడబోయే రెండు మ్యాచ్లనూ గెలిస్తే.. 10 పాయింట్ల నుంచి 14కు ఎగబాకుతుంది. అప్పుడు పాయింట్ల పట్టికలో ఢిల్లీ కేపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ సమానంగా నిలుస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం.. ఢిల్లీ కేపిటల్స్ కంటే హైదరాబాద్ జట్టు నెట్ రన్రేట్ చాలా మెరుగ్గా ఉంది. బెట్ రన్రేట్ నమోదు చేసిన రెండింట్లో ఒకటి ప్లేఆఫ్కు చేరుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు నెట్ రన్రేట్ ప్లస్ 0.396 కాగా.. ఢిల్లీ కేపిటల్స్ ప్లస్ 0.030 మాత్రమే. ఇదే పరిస్థితి చివరి మ్యాచ్లల్లో కొనసాగితే.. ఢిల్లీ కేపిటల్స్ ప్లేఆఫ్ రేస్ నుంచి తప్పుకోవడం ఖాయమౌతుంది.