ఆ స్టార్ క్రికెటర్లకు ఇదే చివరి ఐపీఎల్? అప్పుడే లిస్ట్ కూడా ప్రిపేర్? ప్రక్షాళన వైపే
బెంగళూరు: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్.. కొందరు క్రికెటర్లకు చేదు జ్ఙాపకాలను మిగిల్చింది.. మిగల్చబోతోంది కూడా. ఈ సీజన్లో వారి ప్రదర్శన అంచనాలకు తగ్గట్టుగా, పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా ఉండట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దాదాపు అన్ని ఫ్రాంఛైజీలు కూడా తమ జట్టులో కొత్త ముఖాలను తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. మరో అయిదారు నెలల్లో ఐపీఎల్-2021 టోర్నమెంట్ ఆరంభం అయ్యే అవకాశాలు లేకపోలేదని, ఈలోగాకొత్త రక్తాన్ని నింపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
పీక్ స్టేజ్లో ఐపీఎల్: ప్లేఆఫ్ షెడ్యల్ ఇదే. ఫైనల్ అక్కడే: లీగ్ దశలో ఇక హైఓల్టేజ్ మ్యాచ్లు
ఐపీఎల్లో సీనియర్ క్రికెటర్ల కేరీర్కు పుల్స్టాప్
కొందరు సీనియర్ క్రికెటర్ల కేరీర్కు ఈ ఐపీఎల్లో పుల్స్టాప్ పడే అవకాశాలు లేకపోలేదు. వారికి ఇదే చివరి ఐపీఎల్ టోర్నమెంట్ కావచ్చని అంటున్నారు. ఇకముందు నిర్వహించే టోర్నమెంట్లలో వారు కనిపించకపోవచ్చని, దీనికి సంబంధించిన ప్లేయర్ల జాబితాను నెటిజన్లు ప్రిపేర్ చేశారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి కూడా. ఐపీఎల్-2021 నాటికి జట్టులో కొత్త వారిని తీసుకోవాలనే ఉద్దేశం ఉందనే విషయాన్ని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్లో స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశారు.
సీనియర్లకు నో ఛాన్స్?
దాదాపు అన్ని ఫ్రాంఛైజీలు కూడా ఇవే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరెవరు వచ్చే ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్లో ఆడకపోవచ్చనే అంచనాలతో కూడిన జాబితాను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 35 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల క్రికెటర్లెవరూ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడే అవకాశం లేదని అంటున్నారు. టీమిండియా మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీని ఈ కేటగిరీ నుంచి మినహాయింపునిచ్చారు.
వచ్చే ఏడాది ఐపీఎల్ మిస్ అయ్యే క్రికెటర్ల జాబితా ఇదే..
వచ్చే ఏడాది ఐపీఎల్ మిస్ అయ్యే క్రికెటర్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) డ్వేన్ బ్రావో (వెస్టిండీస్), ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), మురళీ విజయ్, కేదార్ జాదవ్, సురేష్ రైనాలు ఉన్నారు. ఇక మళ్లీ వారు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్లను ఆడకపోవచ్చని అంటున్నారు. షేన్ వాట్సన్, సురేష్ రైనాలను ఇతర ఫ్రాంఛైజీలు తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.. ఈ సీజన్లో ఏ మాత్రం రాణించలేకపోయిన మురళీ విజయ్, కేదార్ జాదవ్.. శాశ్వతంగా ఐపీఎల్కు దూరం కావొచ్చని అంచనా వేస్తున్నారు నెటిజన్లు. డ్వేన్ బ్రావో సత్తా చాటుకోలిగితే.. చెన్నై సూపర్ కింగ్స్లోనే కొనసాగొచ్చు. వయస్సు పైబడిన దృష్ట్యా ఇమ్రాన్ తాహిర్కు ఇదే చివరి ఐపీఎల్ కావడం ఖాయమంటున్నారు.
రాబిన్ ఊతప్ప.. సునీల్ నరైన్లకూ
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతోన్న రాబిన్ ఊతప్ప.. కోల్కత నైట్ రైడర్స్ ఆల్రౌండర్ సునీల్ నరైన్లనూ ఆయా ఫ్రాంఛైజీలు వదలుకోవడానికి అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ సీజన్లో వారిద్దరూ ఏ మాత్రం రాణించలేకపోయారు. సునీల్ నరైన్ను ఆల్ రౌండర్ కేటగిరీలో తీసుకుంది కోల్కత ఫ్రాంఛైజీ. ఒకట్రెండు మ్యాచుల్లో రాణించినా చాలా ఇన్నింగుల్లో దారుణంగా విఫలం అయ్యాడు. పించ్ హిట్టర్గా గుర్తింపు సునీల్ నరైన్.. బౌలింగ్లో అద్భుతాలు సృష్టించగలడు. మీడియం పేసర్ ఇషాంత్ శర్మను ఢిల్లీ కేపిటల్స్ వదులుకోవచ్చని తెలుస్తోంది.