IPL 2021 తొమ్మిదో జట్టు రేసులో బిగ్షాట్స్: 60 నుంచి 74 మ్యాచ్లు: అయిదు నెలల్లో మెగా టోర్నీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో కొత్త జట్టు రావడం దాదాపు ఖరారైంది. ఈ వారమే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చేపట్టబోతోంది. ఈ సారి ఐపీఎల్ మెగా టోర్నమెంట్లో తొమ్మిది జట్ల మధ్య హోరాహోరీ పోరును చూడొచ్చు. ఎప్పట్లాగే వేసవి సీజన్లోనే ఐపీఎల్-2021ను నిర్వహించబోతోంది. ఇంకో అయిదారు నెలల్లో మళ్లీ ఐపీఎల్ మెగా టోర్నమెంట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐపీఎల్-2021ను స్వదేశంలోనే షెడ్యూల్ చేయడానికీ ఛాన్స్ ఉంది.
Recommended Video
తొమ్మిదో జట్టు రేసులో అదాని, గోయెంకా
కొత్తగా తొమ్మిదో జట్టు కోసం బడా కార్పొరేట్ సంస్థలు రేసులో నిల్చున్నాయి. అదాని గ్రూప్, ఆర్పీ-సంజయ్ గోయెంకా గ్రూప్ సహా అహ్మదాబాద్కు చెందిన మరో రెండు కార్పొరేట్ కంపెనీలు తొమ్మిదో ఫ్రాంఛైజీ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదాని, ఆర్పీఎస్జీ గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా బీసీసీఐతో మంతనాలను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదివరకు ఐపీఎల్ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు ఫ్రాంఛైజీగా ఉన్నారు సంజీవ్ గోయెంకా. ఆ అనుభవంతో ఈ సారి గుజరాత్ ఫ్రాంఛైజీని స్వాధీనం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు.
అదానితో జట్టు మోహన్లాల్..
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్..అదాని గ్రూప్తో జట్టు కట్టొచ్చని తెలుస్తోంది. ఐపీఎల్-2020 ఫైనల్ మ్యాచ్ కోసం ఆయన దుబాయ్కు కూడా వెళ్లొచ్చారు. అప్పుడే ఆయన ఫ్రాంఛైజీని తీసుకుంటారంటూ వార్తలు వెలువడ్డాయి. తొమ్మిదో జట్టు కోసం పోటీలో ఉన్న అదాని గ్రూప్లో కో ఓనర్గా మోహన్లాల్ ఉంటారని తెలుస్తోంది. తొమ్మిదో జట్టు కోసం బీసీసీఐ ఈ వారమే టెండర్లను దాఖలు చేసే అవకాశం ఉండటంతో.. అదాని, ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ సహా మరో రెండు కార్పొరేట్ సంస్థలు టెండర్లను దాఖలు చేయడానికి రెడీ అవుతున్నాయి.
ఐపీఎల్-2022లోనే కొత్త జట్టు..
కొత్త ఫ్రాంఛైజీని, కొత్త జట్టును ఐపీఎల్-2021 కోసం ఎంపిక చేయాల్సి వస్తే.. మెగా ఆక్షన్ను నిర్వహించాల్సి ఉంటుంది. మెగా ఆక్షన్ను నిర్వహించడానికి సమయం లేదని బీసీసీఐ కరాఖండిగా తేల్చిసినట్టు చెబుతున్నారు. ఐపీఎల్-2021 సీజన్ 14వ ఎడిషన్.. వచ్చే ఏడాది మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో టోర్నమెంట్ను నిర్వహించడానికి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో నాలుగైదు నెలల్లో మెగా ఆక్షన్ను నిర్వహించడం, దాన్ని పూర్తి చేయడం.. కష్టతరమౌతుందని బీసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జట్టు చేరిక వల్ల మ్యాచ్ల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది.
కొత్త జట్టు చేరికతో.. మ్యాచ్ల సంఖ్యా భారీగా..
కొత్త జట్టును ఐపీఎల్-2021లో చేర్చితే.. మ్యాచ్ల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఎనిమిది ఐపీఎల్ జట్లు 14 చొప్పున లీగ్ మ్యాచ్ల చొప్పున ఆడుతున్నాయి. కొత్త జట్టు చేరికతో దీని సంఖ్య 60 నుంచి 74కు చేరుకుంటుంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది బీసీసీఐకి. సమయం తక్కువగా ఉన్నందున.. ఈ సారి ఆ రిస్క్ను తీసుకోకూడదనే భావిస్తోంది బీసీసీఐ. అందుకే కొత్త ఫ్రాంఛైజీ కోసం దాఖలు చేయాల్సిన టెండర్ల ప్రక్రియను కాస్త ఆలస్యంగా చేపట్టడానికి కసరత్తు చేస్తోంది. దీపావళి తరువాతే కొత్త ఫ్రాంఛైజీ టెండర్లను ఆహ్వానిస్తుందని అంటున్నారు.