IPl 2021 ఫ్రాంఛైజీల్లో కరోనా పుట్ట: వృద్ధిమాన్ సాహా, అమిత్ మిశ్రా: ఇప్పటికే ఆ నలుగురు
న్యూఢిల్లీ: రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్కు కరోనా వైరస్ కాటు వేసింది. ఐపీఎల్ టోర్నమెంట్ను కూడా వదల్లేదు. బయో సెక్యూర్ బబుల్ను ఛేదించుకుని వెళ్లి మరీ ఫ్రాంఛైజీల్లో తిష్ట వేసింది. నాలుగు ఫ్రాంచైజీల ఆటగాళ్లకు కరోనా సోకింది. కరోనా వైరస్ బారిన పడుతోన్న ఆటగాళ్ల లిస్ట్ పెరుగుతోంది. ఇప్పటికే నలుగురు కరోనా వైరస్ బారిన పడగా.. తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగింది. ఆరుకు చేరింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఐపీఎల్ టోర్నమెంట్ మొత్తాన్నీ సస్పెండ్ చేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది వెల్లడించలేదు. నిరవధికంగా వాయిదా వేసింది.
ఇదివరకు కోల్కత నైట్ రైడర్స్, ఆ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీల్లో కనిపించిన కరోనా మహమ్మారి.. మరో రెండు జట్ల ఆటగాళ్లకు సోకింది. సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ జట్లకు కరోనా సెగ తగిలింది. సన్రైజర్స్ హైదరాబాద్ సీనియర్ ప్లేయర్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ వృద్దిమాన్ సాహా కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతనికి పాజిటివ్ అని తేలింది. వెంటనే అతణ్ని ఐసోలేషన్కు తరలించారు. వృద్దిమాన్ సాహాతో డ్రెస్సింగ్ రూమ్, హోటల్ రూమ్ను పంచుకున్న వారికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. అతనితో సన్నిహితంగా ఉన్నవారు కూడా స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు.
ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీని కూడా కరోనా కమ్మేసింది. ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఫలితంగా- ఆ జట్టు మొత్తం ఐసోలేషన్లోకి వెళ్లింది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్లో తాజాగా కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. దీనితో క్వారంటైన్లో ఉంటున్నారు.
ఇప్పటికే కోల్కత నైట్ రైడర్స్ జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కరోనా పాజిటివ్గా తేలారు. మీడియం పేసర్ వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. దీనితో సోమవారం కోల్కత నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ను బీసీసీఐ వాయిదా వేసింది. అదే సమయంలో వరుసగా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సీజన్ మొత్తాన్నీ నిరవధికంగా వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని వెల్లడించలేదు.