రూ.50 లక్షలే: టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రీఎంట్రీ: ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రాగా
చెన్నై: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ చేతేశ్వర్ పుజారా ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా టోర్నమెంట్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ సీజన్లో అతను ఆడబోతోండటం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. ఐపీఎల్ వేలంపాటల్లో పాల్గొన్న ప్రతీసారీ అతనికి దురదృష్టం వెంటాడుతూ వచ్చింది. ఈ సారి మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ రూపంలో అదృష్టం అతని తలుపు తట్టింది. 50 లక్షల రూపాయలతో చేతేశ్వర్ పుజారాను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అది అతని బేస్ ప్రైజ్.
IPL auction: మరో ఫాస్ట్ బౌలర్పై ఏకంగా రూ.15 కోట్లు: ఎవరతను? ఏ టీమ్లో చేరాడు?
టెస్ట్ ప్లేయర్ కావడం వల్లే..
బేస్ ప్రైజ్కు మించి ఒక్క రూపాయి కూడా అతని మీద ఇన్వెస్ట్ చేయలేకపోయింది ఏ ఫ్రాంఛైజీ కూడా. చేతేశ్వర్ పుజారా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. గంటల కొద్దీ క్రీజ్లో పాతుకుని పోయి, సుదీర్ఘ ఇన్నింగ్ను ఆడగల సామర్థ్యం అతనికి ఉంది. ఎన్ని గంటలైనా నింపాదిగా, అలా ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేయగలడు. అదే అతనికి మైనస్ పాయింట్ అయినట్టుంది. టీ20 ఫార్మట్ అలాక్కాదు. 20 ఓవర్లలో ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే.. అంత బెటర్ అనేది అందరికీ తెలిసిన విషయమే.
బ్యాటింగ్ శైలి సరిపోదా?
పుజారా బ్యాటింగ్ శైలి.. టీ20 ఫార్మట్కు సరిపోదనే కారణంతో అతణ్ని ఏ ఫ్రాంఛైజీ కూడా ఇన్నాళ్లూ ఐపీఎల్లోకి తీసుకోలేదు. ఈ సారి మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ధైర్యం చేసింది. అతనిపై నమ్మకాన్ని ఉంచింది. ఇదిలావుండగా- బేస్ ప్రైజ్ మొత్తానికి చేతేశ్వర్ పుజారాను జట్టులోకి తీసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. ఇందులో రెండు రకాల విమర్శలు ఉన్నాయి. ఒకటి- పుజారా వంటి గొప్ప బ్యాట్స్మెన్పై 50 లక్షల రూపాయలే ఖర్చు పెట్టడం.. రెండు- టెస్ట్ స్పెషలిస్ట్ పుజారాను టీ20 ఫార్మట్ క్రికెట్లోకి తీసుకోవడం.
రెండు రకాల విమర్శలు..
ఈ రెండింటి విమర్శల టార్గెట్ చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మేనేజ్మెంట్. నింపాదిగా బ్యాటింగ్ చేసే పుజారాను జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కొందరు నెటిజన్లు, క్రికెట్ ప్రియులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోండగా.. తక్కువ రేటుకు అతణ్ని తీసుకోవడం ఏ మాత్రం సరికాదని, అతణ్ని అవమానించినట్టయిందనే అభ్యంతరాలను మరికొందరు వ్యక్తం చేస్తోన్నారు. దీనిపై ట్రోల్స్ చేస్తోన్నారు. వయసు మళ్లిన టీమ్గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్లోకి మరో సీనియర్ రావడం సరికాదని అంటున్నారు.
కృష్ణప్పపై కోట్లు..
కృష్ణప్ప గౌతమ్ వంటి అనుభవం లేని క్రికెటర్పై తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా ధారపోసిన చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ పుజారా వంటి స్టార్ బ్యాట్స్మెన్పై బేస్ ప్రైజ్కు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టలేకపోయిందంటూ అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. ఐపీఎల్ పక్కా కమర్షియల్గా మారిందనడానికి ఈ ఉదంతమే ఉదాహరణగా నిలిచిందంటూ మండిపడుతున్నారు. ఊరూపేరూ తెలియని విదేశీ క్రికెటర్లపై కోట్లు గుమ్మరిస్తోన్న సమయంలో టీమిండియా తరఫున ఆడుతోన్న పుజారాపై ఆ స్థాయిలో ఖర్చు పెట్టకపోవడాన్ని తప్పుపడుతున్నారు.