'ఇంతబాగా రాణించాడు.. వేలంలో అతడిని కొనుగోలు చేయకపోవడం ఆశ్చర్యపరిచింది'
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్లో ఓడినా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. సీజన్ ప్రారంభంలో వార్నర్ సేన ఆట.. పడుతూ లేస్తూ సాగింది. కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్లలో గెలుపు ఖాయం అనుకున్న స్థితిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. కానీ చివరి మూడు మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్లపై ఘన విజయాలు సాధించి అనూహ్యంగా ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఒకానొక దశలో టోర్నీ రేసు నుంచి తప్పుకునేలా కనిపించిన సన్రైజర్స్ .. పుంజుకుందంటే జాసన్ హోల్డర్ కూడా ఓ కారణం. ఆతడి చేరిక జట్టులో సమతూకం తీసుకువచ్చింది.
ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్రైజర్స్ హైదరాబాద్ విజయంలో జాసన్ హోల్డర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 4 ఓవర్లలో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన హోల్డర్.. బ్యాటింగ్లో 24 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఛేజింగ్లో తీవ్ర ఒత్తిడిలో హోల్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. టోర్నీ ఆరంభంలోనే గాయపడిన మిచెల్ మార్ష్ స్థానంలో జట్టులోకి వచ్చిన హోల్డర్.. సన్రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. లీగ్ దశలో కూడా ధాటిగా బ్యాటింగ్ చేసి జట్టుకు రన్ రేట్ పెంచాడు.
ఐపీఎల్ 2020లో 7 మ్యాచ్లు మాత్రమే ఆడిన జాసన్ హోల్డర్ 14 వికెట్లు తీయడంతో పాటు 66 రన్స్ చేశాడు. అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ 2020 వేలంలో హోల్డర్ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వెస్టిండీస్ కెప్టెన్గా ఉన్నహోల్డర్ను వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం పట్ల టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జేమ్స్ నీశమ్, క్రిస్ మోరీస్, మొయిన్ అలీ లాంటి ఆల్రౌండర్లను ఎంపిక చేసుకున్న ఫ్రాంచైజీలు హోల్డర్ను పక్కనబెట్టడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు.
తాజాగా గౌతమ్ గంభీర్ ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... 'జేమ్స్ నీశమ్, క్రిస్ మోరీస్, మొయిన్ అలీ లాంటి ఆల్రౌండర్లు ఆడుతున్నారు. జాసన్ హోల్డర్ను వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతర్జాతీయ జట్టుకు హోల్డర్ కెప్టెన్గా ఉన్నాడు. అతడు నిరంతరం అంతర్జాతీయ క్రికెట్లో రెండు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. కొత్త బంతితో బాగా రాణిస్తాడు. పరుగులు చేస్తాడు. ఓవర్సీస్ ఆల్రౌండర్ నుంచి ఇంతకు మంచి ఏం ఆశించగం. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్లకు ఒత్తిడిని ఎదుర్కోవడం తెలుస్తుంది' అని పేర్కొన్నాడు.
జాసన్ హోల్డర్ లేటుగా యూఏఈ వచ్చి క్వారంటైన్ పూర్తి చేసుకునేసరికి దాదాపు సగం సీజన్ పూర్తయింది. తుది జట్టులో నాలుగు విదేశీ ఆటగాళ్ల నిబంధన కారణంగా అతనికి ఆడే అవకాశం రాలేదు. అప్పటివరకు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ తుది జట్టులో ఆడారు. అయితే విలియమ్సన్ గాయపడడంతో.. ఆ స్థానంలో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో హోల్డర్ ఆడాడు. ఆడడమే కాదు ఔరా అనిపించాడు. సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, రియాన్ పరాగ్లను ఔట్ చేశాడు. ఆపై సన్రైజర్స్ కెప్టెన్ బెయిర్స్టోను పక్కనపెట్టడంతో హోల్డర్ మరో ఏడు మ్యాచులు ఆడాడు.