బొలెరోలో వచ్చారు.. దర్జాగా దోచారు.. జగిత్యాలలో కోటి రూపాయల ఫోన్లు చోరీ (వీడియో)
జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. దాదాపు కోటి రూపాయలకు ఎసరు పెట్టారు. బొలెరో వాహనంలో దర్జాగా వచ్చి మరీ చోరీకి పాల్పడ్డారు. జగిత్యాలలోని యావర్ రోడ్డు - అంగడి బజార్ లో రెండు మొబైల్ దుకాణాల్లో చొరబడ్డ నలుగురు దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. విలువైన ఫోన్లతో పాటు ట్యాబులు ఎత్తుకెళ్లారు. వెంటతెచ్చుకున్న గోనెసంచుల్లో నింపుకుని దుకాణాలను ఊడ్చేశారు.
మంగళవారం అర్ధరాత్రి దాటాక దోపిడి దొంగలు యావర్ రోడ్డుకు చేరుకున్నారు. భవాని సెల్ పాయింట్తో పాటు లాట్ మొబైల్ షాపులో చోరీకి తెగబడ్డారు. తమ వెంట తెచ్చుకున్న పరికరాలతో షెట్టర్లు తొలగించి గుట్టుచప్పుడు కాకుండా అందినకాడికి దోచుకున్నారు. రెండు పెద్ద మొబైల్ షాపులే కావడంతో నష్టం పెద్దఎత్తున జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దాదాపు కోటి రూపాయల సరుకు దొంగలు ఎత్తుకెళ్లారని తెలుస్తోంది.
కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన ఈ చోరీ స్థానికంగా చర్చానీయాంశమైంది. బొలెరోలో దర్జాగా వచ్చిన దొంగలు.. చోరీ సొత్తును నాలుగుసార్లు తరలించినట్లు సమాచారం. ఎంత రాత్రయినా రద్దీగా ఉండే రోడ్డులో ఇంత భారీ చోరీ జరగడం అనుమానాలకు తావిస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలిని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ మురళీధర్ రావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.