జగిత్యాల జిల్లాలో కరోనా విజృంభణ, 12 మందికి వైరస్, సిరిసిల్లలో ముగ్గురికి..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తొలుత ఢిల్లీ నుంచి వచ్చినవారితో కేసులు పెరగగా.. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వస్తోన్న వారితో కేసులు పెరుగుతున్నాయి. వైరస్ కేసులు జగిత్యాల జిల్లాలో ఎక్కువగా రికార్డవుతున్నాయి. కోరుట్ల, జగిత్యాల, మెట్ పల్లి నుంచి ఎక్కువమంది ముంబైలో ఉంటారు. ముంబైలో కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో వారు సొంత ఊరు బాటపడుతున్నారు. పరీక్షలు చేస్తుండగా వైరస్ బయటపడుతుంది.
జగిత్యాల జిల్లాలో ముంబై నుంచి వచ్చిన మరో 12 మంది వలస కూలీలకు వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. మల్యాల మండలంలో ఆరుగురు, మేడిపల్లి మండలంలో ముగ్గురు, గొల్లపల్లి, కోరుట్ల, కథలాపూర్ మండలాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం 54 కేసులు నమోదు కాగా ఇందులో 49 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముగ్గురకి వైరస్ తగ్గి డిశ్చార్జ్ కాగా.. ఇద్దరు వైరస్ బారినపడి చనిపోయారు.
మరోవైపు సిరిసిల్లా జిల్లాలో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వేములవాడ మున్సిపల్ పరిధిలోని ముగ్గురికి వైరస్ సోకిందని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు తెలిపారు. రుద్రవరంలో ఇద్దరికి, పట్టణంలోని మార్కండేయ నగర్లో ఒకరికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. రుద్రవరానికి చెందిన ఒకరు ముంబై నుంచి రావడంతో వైరస్ వచ్చింది. అతని కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కూడా వచ్చింది. ముంబై నుంచి వచ్చిన వలసకూలీ ఫ్యామిలీ మార్కండేయనగర్లో అద్దెకు దిగారు. వీరిలో ఒకరికి పాజిటివ్గా వచ్చిందని అధికారులు ధ్రువీకరించారు. ఈ ముగ్గురిని హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించామని తెలిపారు.