కేసీఆర్ క్యాబినెట్ పై అసమ్మతి సెగలు .. గులాబీ బాస్ అవమానించారని కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ గులాబీ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నింపింది. సీనియర్ నాయకులను పక్కనపెట్టి, జూనియర్లను మంత్రి పదవులు వరించడం చాలా మంది సీనియర్ నాయకులకు మింగుడు పడడం లేదు. ఇప్పటికీ కేసీఆర్ క్యాబినెట్ పై అసమ్మతి సెగలు ఇంకా రగులుతూనే ఉన్నాయి.
హుజూర్నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ .. ఇక సమరమే !!
కార్యకర్తల సమావేశంలో కన్నీరు పెట్టుకున్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
తాజాగా తనకు మంత్రిగా అవకాశం ఇవ్వలేదని, నాలుగు సార్లు గెలిచిన తనను అవమాన పరిచారని ఒక ఎమ్మెల్యే కార్యకర్తల సమావేశంలో కన్నీరు పెట్టుకోవడం గులాబీ పార్టీలో నెలకొన్న అసమ్మతికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ఇక అసలు విషయానికి వస్తే కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీనియర్ నాయకుడు. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ ఇటీవల చేసిన క్యాబినెట్ విస్తరణలో తనకు స్థానం దొరుకుతుందని ఎంతగానో ఆశపడ్డారు విద్యాసాగర్ రావు .
నాలుగు సార్లు విజయం సాధించినా మంత్రి పదవి దక్కలేదని ఆవేదన
సీఎం కేసీఆర్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయనకు కాకుండా జూనియర్లకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఇక విద్యాసాగర్ రావుకు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యునిగా అవకాశం కల్పించారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదని విద్యాసాగర్ రావు తీవ్ర అసహనంతో ఉన్నారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన నేడు కార్యకర్తలు అనుచరులు మిత్రుల సమావేశంలో తనకు అవమానం జరిగిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రాధాన్యత లేని చిన్న పదవి ఇచ్చారన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
అంతేకాదు తనకు ప్రాధాన్యత లేని చిన్న పదవి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రెండుసార్లు గెలిచిన వాళ్లకి మంత్రి పదవులు ఇచ్చి నాలుగు సార్లు గెలిచిన తనను అవమానించారని కన్నీరు పెట్టుకున్న విద్యాసాగర్ రావు తన అసంతృప్తిని కార్యకర్తల ముందు బహిర్గతం చేశారు. దీంతో కార్యకర్తలు పార్టీ కోసం విద్యాసాగర్ రావు ఎంతో చేశారని సీఎం కేసీఆర్ ఆయనకు మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో చిన్న పదవి ఇచ్చి సర్దుకోమని చెప్పడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
బుజ్జగించేందుకు ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగుతారా
ఇటీవల విద్యాసాగర్ రావు ను పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యునిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఆయన తన అసంతృప్తిని మాత్రం వీడలేదు. ఇక విద్యాసాగరరావు సైతం తనకసలు ఎలాంటి పదవులు వద్దని, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటానని బాధాతప్త హృదయంతో పేర్కొన్నారు. మరి విద్యాసాగరరావు సీఎం కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ పట్ల అసంతృప్తి వెళ్ళగక్కిన నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తున్న ట్రబుల్ షూటర్ కేటీఆర్ ఏం చేయబోతున్నారో!