దేశద్రోహి సరికెల లింగన్న అరెస్ట్..?: ఆర్మీ సమాచారం చేరవేసిన వ్యక్తికి నగదు పంపడంతో..;
భారత ఆర్మీకి చెందిన రహస్యాలు ఉగ్రవాదులకు చేరవేసిన రాకేశ్ అనే వ్యక్తికి నగదు పంపించిన సరికెల లింగన్నను జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ వచ్చిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. నగదు పంపడంపై ప్రశ్నించారు. ఆ సమయంలో అరెస్ట్ చేసి తీసుకెళదామని అనుకొన్నారు. కానీ వారికి వారెంట్ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. గుధవారం ట్రాన్సిట్ వారెంట్తో వచ్చిన పోలీసులు.. లింగన్నను అరెస్ట్ చేసి, కశ్మీర్ తీసుకెళ్లిపోయారు.
గురువారం మెట్పల్లి కోర్టులో సరికెల లింగన్న ప్రవేశపెట్టారు. అరెస్ట్కు గల ట్రాన్సిట్ వారెంట్ మేజిస్ట్రేట్కు చూపించారు. దీంతో జడ్జీ అనుమతి ఇవ్వడంతో అరెస్ట్ చేసి.. జమ్ముకశ్మీర్ తీసుకెళ్లారు. అక్కడ రాకేశ్ ఎలా తెలుసు..? మిగతావారితో పరిచయం ఉందా..? ఎందుకు నగదు పంపించారు అనే అంశాలపై ప్రశ్నించనున్నారు.
మల్లాపూర్ మండలం కుస్తాపూర్కి చెందిన లింగన్నకు దుబాయ్లో ఒక స్నేహితుడు ఉండేవాడు. అతని సూచన మేరకు జమ్ముకశ్మీర్లో ఉంటోన్న రాకేశ్ రూ.5 వేలు పంపించాడు. గూగుల్ పే ద్వారా రాకేశ్కు నగదు పంపించినట్టు అంతకుముందే వివరించాడు. ఆర్మీ రహస్యాలు చేరవేసిన రాకేశ్ను.. జమ్ముకశ్మీర్లో పోలీసుస్టేషన్పై దాడికేసులో అరెస్ట్ చేశారు. అతనిని విచారిస్తే డొంక కదిలింది. అతని ఖాతాలో చాలా మంది నగదు జమచేశారు. అందులో సరికెల లింగన్న ఒకరు. దీంతో జమ్ముకశ్మీర్ పోలీసులు జగిత్యాల జిల్లా కుస్తాపూర్ వచ్చారు.
జమ్ముకశ్మీర్ ఆర్మీ క్యాంపులో రాకేశ్ పనిచేసేవాడు. అయితే ఆర్మీ రహస్యాలు ఉగ్రవాదులకు ఇస్తున్నారని పోలీసులు కనిపెట్టారు. దీంతో అతని బ్యాంకు ఖాతా వివరాలను పోలీసులు చెక్ చేశారు. అందులో లింగన్న పేరు ఉండటంతో.. అతనిపై అనుమానం వచ్చింది. దేశద్రోహం అభియోగం మోపి గురువారం అదుపులోకి తీసుకున్నారు.