కేసీఆర్ జగన్ను చూసి నేర్చుకో.. సీఎంపై జీవన్ రెడ్డి ఫైర్
జగిత్యాల : సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇచ్చిన హామీల అమలేదని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే కేసీఆర్ సర్కార్ పనిచేస్తుందని .. ఉదహరణకు ఎన్నికల సమయంలోనే అర్హులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. తర్వాత మిగతా హమీలు, లబ్ధిదారుల ఊసును మరచిపోతారని మండిపడ్డారు.
పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం జగన్ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని సూచించారు జీవన్ రెడ్డి. ఉద్యోగాల కల్పన, పెన్షన్లపై జగన్ చూపుతున్న చొరవను అభినందించారు. ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్కు ప్రజలు గుర్తొస్తారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం పాత లబ్ధిదారులకు పెన్షన్ పెంచారన్నారు. అయితే కొత్త లబ్దిదారుల సంగతేంటని ప్రశ్నించారు. అంతేకాదు రుణమాఫీ ఊసేలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించిన యువత బాగోగులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
గత ఐదేళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయలేదని విమర్శించారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో ఉద్యోగులకు 27 శాతం పీఆర్సీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడరని ఉద్యోగుల మీద అవినీతి పరులను ముద్ర వేశారని ఆరోపించారు. దీంతోపాటు సీపీఎస్ రద్దు వల్ల ప్రభుత్వానికి నష్టం జరగదని .. కానీ కావాలని జాప్యం చేస్తుందని విమర్శించారు.