దేశ ద్రోహికి డబ్బులు: జమ్మూకాశ్మీర్ పోలీసుల అదుపులో తెలంగాణ వ్యక్తి
జగిత్యాల: జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్థాపూర్కు వచ్చిన జమ్మూకాశ్మీర్ పోలీసులు స్థానిక వ్యక్తిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దేశ ద్రోహం కింద అరెస్టైన వ్యక్తికి కుస్తాపూర్ వాసి లింగన్న డబ్బులు పంపాడని పోలీసులు తెలిపారు.
ఆర్మీకి సంబంధించిన సమాచారం క్యాంపస్ నుంచి బయటకు లీక్ చేస్తున్నాడన్న అనుమానంతో జమ్మూకాశ్మీర్ పోలీసులు రాకేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జమ్మూకాశ్మీర్లోని ఓ పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ఘటనలో కూడా రాకేష్ పాత్ర ఉన్నట్లు తేల్చారు.
ఈ కేసు విచారణ చేపట్టగా రాకేష్ బ్యాంక్ అకౌంట్కి మల్లాపూర్ మండలం కుస్థాపూర్కి చెందిన సరికెల లింగన్న అనే వ్యక్తి ఫిబ్రవరి 15న రూ. 5వేలు, ఫిబ్రవరి 23న 4వేల రూపాయలు పంపించినట్లు గుర్తించారు పోలీసులు.
జమ్మూకాశ్మీర్లో ఉన్న రాకేష్కు మల్లాపూర్ మండలం కుస్థాపూర్లో ఉన్న లింగన్నకు గల సంబంధాలు ఏంటని ఆ రాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆర్మీకి సంబంధించిన వివరాలు బయటకు ఎలా వెళ్తున్నాయి.. రాకేష్కు లింగన్న ఎందుకు డబ్బులు పంపించాల్సి వచ్చిందనే కోణంలో మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారు. ప్రస్తుతం మల్లాపూర్ పోలీస్ స్టేషన్లోనే సరికెల లింగన్నను జమ్మూకాశ్మీర్ పోలీసులు విచారిస్తున్నారు.