జగిత్యాలలో ఎస్సారెస్పీ కెనాల్లోకి దూసుకెళ్లిన కారు... ఎమ్మెల్యే సమీప బంధువులు మృతి...
జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మేడిపల్లి-కట్లకుంట సమీపంలో ఓ కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. మృతులను జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమీప బంధువులైన అమరేంద్ర రావు,ఆయన భార్య శిరీష,కుమార్తె శ్రేయగా గుర్తించారు.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన అమరేంద్రరావు.. భార్యా, కుమారుడు, కూతురుతో కలిసి సోమవారం(ఫిబ్రవరి 15) ఉదయం జోగినపల్లి జాతరకు బయలుదేరారు. ఈ క్రమంలో మేడిపల్లి మండలం కట్లెకుంట సమీపంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్లో పడిపోయింది. అమరేంద్ర రావు కుమారుడు జయంత్కు ఈత రావడంతో చాకచక్యంగా కెనాల్ నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. మిగతా ముగ్గురు కారులోనే చిక్కుకుపోయి మృతి చెందారు. జయంత్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు.
ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై జయంత్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గతేడాది ఫిబ్రవరిలో పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న కారు కరీంనగర్ జిల్లా అలుగునూర్ సమీపంలోని కాకతీయ కెనాల్ కాలువలో పడటంతో మృత్యువాతపడ్డారు.
Recommended Video
కొద్దిరోజుల క్రితం వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం కొంకపాకలోనూ ఇదే తరహాలో ఓ కారు ఎస్సారెస్పీ కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక ఉపాధ్యాయురాలితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వరంగల్ నుంచి పర్వతగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం,డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే కాలువలోకి దిగి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈత రావడంతో అప్పటికే కారు డ్రైవర్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. కారులో ముందు సీట్లో కూర్చున్న వ్యక్తితో పాటు వెనకాల కూర్చున్న సరస్వతి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, మరో వ్యక్తి అందులోనే మృత్యువాతపడ్డారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో కారు నీటిలో కొద్ది దూరం కొట్టుకుపోయింది. దీంతో బయటకు వచ్చే పరిస్థితి లేక నీటిలోనే చిక్కుకొని వారు మృతి చెందారు.