భీమా డబ్బుల కోసం బతికున్న తల్లిని రికార్డుల్లో చంపేసిన తనయ .. ఏం కూతురయ్యా !!
సమాజంలో రోజురోజుకీ మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డే పైసల కోసం బతికున్న తల్లి చనిపోయిందని రికార్డులు సృష్టించింది. చంద్రన్నభీమా డబ్బుల కోసం ఆ బిడ్డ చేసిన నిర్వాకానికి భీమా సిబ్బంది సైతం సహకారం అందించడం, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం రాజంపేటలో కలకలం రేపుతోంది.
8 లక్షలు విరాళంగా గుడికి ఇచ్చిన యాచకుడు: బిచ్చగాడి ఔదార్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే !!
పించను కోసం వెళ్ళిన ఆ తల్లికి షాక్ .. బతికుండగానే చంపేసిన సిబ్బంది
ఆదిలక్ష్మమ్మ అనే మహిళ తనకు పింఛను కావాలని మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా అక్కడి రికార్డుల్లో ఆదిలక్ష్మమ్మ మరణించినట్లుగా ఉంది. అదేంటి అని విషయం ఆరా తీసిన ఆదిలక్ష్మమ్మ డబ్బు కోసం కూతురు చేసిన నిర్వాకం విని గుండెలవిసేలా రోదించారు. ఇక భీమా సిబ్బంది ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే తను చనిపోయానని ఎలా ధృవీకరిస్తారు అని ఆమె అధికారులు నిలదీసింది.అంతేకాదు ఈ నిర్వాకం పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
చంద్రన్నభీమా డబ్బుల కోసం కుమార్తె నిర్వాకం
రాజంపేట పట్టణంలో ని బలిజపల్లి చెందిన ఆదిలక్ష్మమ్మ వెంకటరత్నం దంపతుల కుమార్తె శాంతకుమారి. అయితే గతేడాది నవంబర్ 14 వ తేదీన వెంకటరత్నం మృతిచెందాడు. వెంకటరత్నం చంద్రన్నభీమా లో సభ్యుడు కావడంతో ఆ భీమా సొమ్ము కాజెయ్యాలని భావించిన కుమార్తె నామినీగా తల్లి ఉండాల్సిన స్థానంలో తన పేరును మార్చుకుంది. ఇక తన తల్లి ఆదిలక్ష్మమ్మ చనిపోయిందని రికార్డులు సృష్టించింది. ఇందుకు చంద్రన్న భీమా సిబ్బంది కూడా శాంతకుమారికి సహకరించారు.
బతికున్న తనను ఎలా చంపేస్తారని అధికారులను నిలదీసిన ఆదిలక్ష్మమ్మ
ఇక ఇటీవల తనకు బియ్యం కార్డు, పింఛను ఇవ్వాలని మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లిన ఆదిలక్ష్మమ్మ అక్కడి సిబ్బంది, తన కుమార్తె కలిసి చేసిన నిర్వాకానికి విస్తుపోయారు. తనకు తన భర్త మరణం తరువాత రావాల్సిన చంద్రన్న భీమా ఇవ్వాలని కోరారు. తాను బతికుండగానే తనను ఎలా చంపేస్తారని ఆమె సిబ్బందిని నిలదీశారు. ఇక ఈ విషయంపై, సిబ్బంది అక్రమాలపై ఎంక్వైరీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల స్పందన కార్యక్రమం లో ఎస్పి ని కలిసిన ఆదిలక్ష్మమ్మ తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.
కూతురు చేసిన పనితో మానసికంగా చనిపోయిన తల్లి
ఏది ఏమైనా బతికుండగానే తల్లి చనిపోయిందని కేవలం భీమా డబ్బుల కోసం ఆ కూతురు చేసిన నిర్వాకం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. కంటే కూతుర్నే కనాలి .. కూతురికే తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయని భావించేవారు ఉన్న నేటి రోజుల్లో ఇలాంటి కూతుళ్లు కూడా ఉండడం అత్యంత బాధాకరం. ఇట్లాంటి కూతురు అవసరమా? అన్న భావన కలిగేలా ప్రవర్తించిన ఆ కూతురు చేసిన పనికి నిజంగానే ఆ తల్లి బ్రతికుండగానే మానసికంగా చనిపోయింది. ఆవేదన అనుభవిస్తోంది.