అందుకే కలిశాం, గతం గతః, జగన్ ప్రమాదకరం: ఆది-రామసుబ్బారెడ్డి, కడప రాజకీయాల్లో కీలక మలుపు
కడప: జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశం శుక్రవారం కొలిక్కి వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి, కడప లోకసభ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబు ఇచ్చారు.
కడప రాజకీయాల్లో కీలక మలుపు
చంద్రబాబుతో భేటీ అనంతరం ఆది, రామసుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. వారు ఏళ్ల నాటి వైరాన్ని పక్కన పెట్టారు. ఇద్దరం కలిసి పని చేస్తామని ఉమ్మడిగా ప్రకటన చేశారు. ఆదినారాయణ పార్టీలో చేరిన తర్వాత కూడా వారిద్దరికి మాటలులేవు. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో కలిసి పని చేస్తామని, కడప జిల్లా అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. ఇది కడప రాజకీయాల్లో కీలక మలుపు.
ఇక గతం గతః
ఇద్దరు మీడియా ముందుకు వచ్చి ఇక గతం గతః అని చెప్పారు. తామిద్దరం కలిసి పని చేస్తామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కేడర్ కూడా కలిసి పని చేస్తుందని చెప్పారు. తన వాళ్లకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని, తాను కడప లోకసభకు పోటీ చేస్తానని చెప్పారు. తమ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరూ ఏకీభవించారని, ఏకీభవిస్తారని చెప్పారు.
అందుకే కలిశాం
తమ మధ్య విభేదాలు మరిచిపోయి పని చేస్తామని రామసుబ్బారెడ్డి చెప్పారు. తామంతా కలుస్తామన్నారు. కడపలో మంచి మార్పు కోసం కలుస్తున్నామని చెప్పారు. అలాగే జమ్మలమడుగు నియోజకవర్గం అభివృద్ది కోసం పని చేస్తామన్నారు. మా మధ్య కొన్ని విభేదాలున్నా జిల్లా కోసం, నియోజకవర్గం కోసం పని చేస్తామని చెప్పారు.
జగన్ ప్రమాదకరం
ఈ సందర్భంగా జగన్ పైన ఆదినారాయణ మండిపడ్డారు. జగన్ అబద్దాలతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ లాంటి వారు అధికారంలోకి వస్తే ప్రమాదమని హెచ్చరించారు. తమకు పోటీగా పథకాలు ప్రవేశపెడుతున్నారని, కానీ ఆయనకు బడ్జెట్ గురించి అవగాహన లేదన్నారు. ఆయన కోసం కొన్ని ఛానల్స్ పని చేస్తున్నాయని, కానీ ఫలితం లేదన్నారు.