వైయస్ విషయంలో.. జగన్కే తెలియని విషయం చెప్పిన ఆదినారాయణ రెడ్డి! ఆ తర్వాతే వైసీపీ నుంచి జంప్
కడప: ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు మేడా మల్లికార్జున రావు ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేడా చంద్రబాబు, టీడీపీపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా మేడాకు ఆది కౌంటరిచ్చారు.
ఈ సమయంలో ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తాము సహకరించారమని, జగన్ వల్ల తాము ఎదగలేదని, తాము వైయస్కు సహకరించిన విషయం మీకు తెలియదని మేడాపై మంగళవారం మండిపడ్డారు.
మా సహకారంతో వైయస్ గెలిచారు
వైయస్ రాజశేఖర రెడ్డి భిక్షతో తాను గెలిచానని మేడా మల్లికార్జున రెడ్డి అన్నారని, కానీ ఆ వ్యాఖ్యలు సరికాదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. వాస్తవాలు తెలియకుండా ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి భిక్షతో తాము గెలవడం కాదని, తమ సహకారంతో వైయస్ గెలిచారని చెప్పారు.
'వారానికో కేంద్రమంత్రి, ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బీజేపీ బెదిరింపులు'
జగన్కే తెలియదు, మీకేం తెలుసు
వైయస్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినప్పుడు తమ కుటుంబమే గెలిపించిందని ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా వైయస్ రాజశేఖర రెడ్డికి తాము సహకరించామని చెప్పారు. ఈ విషయాలు మేడా మల్లికార్జున రెడ్డికి మాత్రమే కాదని, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదన్నారు.
జగన్కు చెప్పే వచ్చా
అదే సమయంలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఆదినారాయణ రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదని మేడా అభిప్రాయపడ్డారు. దీనిపై కూడా ఆది కౌంటర్ ఇచ్చారు. నేను వైసీపీ నుంచి గెలిచినప్పటికీ, పార్టీ మారుతున్న విషయం జగన్కు చెప్పానని, ఆయనకు చెప్పే వచ్చానని అన్నారు. కానీ నువ్వు మాత్రం చంద్రబాబును కలుస్తానని ప్రకటించి, రెండ్రోజుల్లో పార్టీ మారిన వ్యక్తివి అని ధ్వజమత్తారు. మేడానే ఓ గంజాయి మొక్క అన్నారు. మేడా కుటుంబానికి టీటీడీ పదవి ఇస్తే మాపై విమర్శలు చేస్తారా అన్నారు.