కడప జిల్లాలో ఆ ముగ్గురూ మృతి: వీడియో వైరల్: అదే రోజు రాత్రి: వారిని గుర్తించే లోపే ఘోరం
పెండ్లిమర్రి: రాష్ట్రంలో మద్యం అమ్మకాల నియంత్రణ, దశలవారీగా ఎత్తివేత కార్యక్రమాలు నిరుపేదల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. మద్యానికి బానిసగా మారిన కొందరు మందుబాబులు శానిటైజర్లను తాగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. శానిటైజర్లను సేవించడం వల్ల ప్రాణాలు పోతాయనే విషయంపై వారికి అవగాహన కల్పించడంలో అటు అధికార యంత్రాంగం కూడా పెద్దగా దృష్టి సారించకపోవడం దీనికి కారణమౌతోంది.
Recommended Video
శానిటైజర్లలో పరిమిత మోతాదు వరకు ఉండే అల్కహాల్ వల్ల మత్తులోకి జారుకోవడానికి అవకాశం ఉందని, దానివల్లే మందుబాబులు వాటిని సేవిస్తున్నారని అంటున్నారు. కడప జిల్లాలో ముగ్గురు వ్యక్తులు శానిటైజర్ను తాగుతూ కనిపించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మత్తు కోసం శానిటైజర్లో నీళ్లను కలుపుకొని తాగుతూ కనిపించిన ఆ ముగ్గురూ అదే రోజు రాత్రి మరణించారు. వారిని ఓబులేసు, భీమయ్య, చెన్నకేశవగా గుర్తించారు అధికారులు.
కడప జిల్లా పెండ్లిమర్రి మండలానికి చెందిన ఈ ముగ్గురూ మద్యానికి బానిసలుగా మారారని, వాటి ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయంగా శానిటైజర్లను తాగారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 14 మంది శానిటైజర్ను తాగిన ఘటన విస్మరించకముందే- మరోసారి అదే తరహా ఉదంతం చోటు చేసుకుంది. వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే అధికారులు వారిని గుర్తించారు. సోమవారం కౌన్సిలింగ్కు పిలిపించారు. ఈ మేరకు వారికి సమాచారం కూడా ఇచ్చారు. అదే రోజు రాత్రి వారు మృత్యువాత పడ్డారు.
వారి మృతదేహాలకు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలను నిర్వహించినట్లు తెలుస్తోంది. దీన్ని పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వం నియంత్రించింది. ఇందులో భాగంగా వాటి రేట్లను భారీగా పెంచింది. పేదలకు మద్యాన్ని దూరం చేయాలనే కారణంతోనే వాటి రేట్లను ఆకాశానికి అంటుకునేలా పెంచేశారు. ఈ పరిణామాల వల్ల మందుబాబు మద్యానికి బదులు శానిటైజర్లను ఆశ్రయిస్తున్నారు.
మద్య నియంత్రణ చర్యలను ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనసాగించడం, అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, దాన్ని నివారించడానికి హ్యాండ్ శానిటైజర్లను విస్తృతంగా అమ్మకంలోకి తీసుకుని రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. చీప్ లిక్కర్ తరహాలోనే అల్కహాల్ మిశ్రమం ఉన్న శానిటైజర్ల ధరలు అందుబాటులో ఉండటం కూడా ఈ పరిస్థితి కారణమౌతోందని అధికారులు భావిస్తున్నారు. ఇదివరకు ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన శానిటైజర్లు కరోనా వల్ల ఇంటింటికీ అందుబాటులో ఉంటున్నాయని, అందులో ఉండే అల్కహాల్ కోసం మందుబాబులు వాటిని సేవిస్తున్నారని చెబుతున్నారు.