మరోసారి కడప జిల్లాకు వైఎస్ జగన్: రెండురోజుల పాటు: ఇడుపులపాయలో
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో పులివెందులలో పర్యటిస్తారు. మంగళ, బుధవారాల్లో జగన్.. పులివెందుల, ఇడుపులపాయలో గడుపుతారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలోని ఆయన సమాధిని సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పిస్తారు.
ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో వైఎస్ జగన్ తన సొంత జిల్లాకు వెళ్లడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 2.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి. 2009 సెప్టెంబర్ 2వ తేదీన కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని పావురాలగుట్ట వద్ద సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ కన్నుమూశారు. ప్రతి సంవత్సరమూ తన తండ్రి జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వైఎస్ జగన్ ఇడుపులపాయలోని ఆయన సమాధిని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది.
వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన మినిట్స్ను ప్రభుత్వం నేడో, రేపో విడుదల చేయనుంది. కడప జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా సహా పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు. ఈ పర్యటనలో పాల్గొనే వారికి ముందుగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించాలని జిల్లా పాలనా యంత్రాంగం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
Recommended Video
ఇడుపులపాయను సందర్శించడానికి వచ్చే వారికి పరిమితంగా అనుమతులను మంజూరు చేయనున్నారు. పాస్లను మంజూరు చేసిన ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలను నిర్వహిస్తామని జిల్లా అధికారులు తెలిపారు. కడప జిల్లాలో కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదు అయ్యాయి. అధికారులు శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 24,747 కేసులు ఈ జిల్లాలో నమోదు అయ్యాయి. ఇందులో 18,176 మంది డిశ్చార్జి అయ్యారు. 6368 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 203 మంది మరణించారు. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోనున్నారు.