పదేళ్లుగా వివక్ష.. సీమను చూసి వైఎస్ఆర్ చలించారు...పట్టించుకొనే నాథుడేడీ.. వైఎస్ జగన్ ఆవేదన
రాయచోటి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. మంగళవారం రాయచోటిలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాయచోటి అభివృద్ధికి పూచీ తనదని చెప్పారు. వైఎస్ఆర్ను నియోజకవర్గ ప్రజలు ప్రేమించారని, తనను బిడ్డగా దీవించారని చెప్పారు. రాయచోటి నియోజకవర్గ ప్రజలకు సర్వదా రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
రాజధానిపై తుది నిర్ణయం ..విశాఖలో 27న క్యాబినెట్ భేటీ ... జగన్ ప్లాన్ ఇదే
వైఎస్ఆర్కు ప్రేమ..
రాయచోటి అంటే వైఎస్ఆర్ మమకారం ఎక్కువ అని జగన్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయ్యాక రాయచోటికి సాగునీరే కాదు తాగునీరు కూడా లేదని చూసి చలించిపోయారని పేర్కొన్నారు. వెలుగళ్లు రిజర్వాయర్ నిర్మించారని, ఔటర్ రింగ్ రోడ్డు కూడా వేయించారని గుర్తుచేశారు. కానీ ఆయన చనిపోయాక రాయచోటి పరిస్థితి ఎప్పటిలానే మారిపోయిందని చెప్పారు. గత పదేళ్ల నుంచి నియోజకవర్గాన్ని పట్టించుకున్న నాథుడే లేదని తెలిపారు.
రాయచోటి లాస్గ్..
రాయలసీమ అంటేనే వెనుకబడిన ప్రాంతం, అందులో కడప జిల్లా చివరి స్థానం అని జగన్ చెప్పారు. రాయచోటి నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం అని జగన్ చెప్పారు. గత ప్రభుత్వం కూడా రాయచోటిపై వివక్ష చూపించిందని జగన్ తెలిపారు. పదేళ్ల నుంచి రాయచోటి వివక్షకు గురవుతూనే ఉందని చెప్పారు. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ను తమ పార్టీలోకి వస్తే రూ.3 కోట్ల నిధులు ఇస్తామని చెప్పిన ఘనుడు చంద్రబాబు అని ఆరోపించారు. కానీ తనను అడక్కపోయిన నియోజకవర్గం కోసం రూ.2 వేల కోట్లు కేటాయిస్తున్నానని సభా వేదికగా జగన్ తెలిపారు. రాయచోటి పట్టణానికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.
వక్ఫ్బోర్డుకు 4 ఎకరాల భూమి..
రాయచోటిలో వివాదాస్పద స్థలం 4 ఎకరాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు కేటాయిస్తున్నట్టు జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు బుధవారం వెలువడుతాయని చెప్పారు. రాయచోటిలో పీహెచ్సీకి నిధులు పెంచుతామని చెప్పారు. 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తామని, ఇందుకోసం రూ.23 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయల కోసం రూ.11.5 కోట్లు ఖర్చు చేయబోతున్నావని వివరించారు.
రెసిడెన్షియల్ స్కూళ్లు కూడా..
రాయచోటిలో డీఎస్పీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయబోతున్నామని జగన్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసు స్టేషన్, మైనార్టీ సహా రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో స్థానికంగా ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్య అందించే అవకాశం కలుగుతుందన్నారు.