సీబీఐ చేతికి వివేకా హత్య కేసు- కడపలో జగన్ కుటుంబానికి షాక్ లు తప్పవా ?
జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద హత్యపై ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇప్పుడు జగన్ కుటుంబానికి చుట్టుకోబోతోందా ? ఈ కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో జగన్ కుటుంబానికి షాక్ లు తప్పవా ? జగన్ వైఖరిపై వివేకా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో కడపలో ఏం జరగబోతోంది ? కీలకమైన సమయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో జగన్ కుటుంబంలో ఇప్పుడు కలకలం రేగుతోంది.
వివేకా హత్య- అనుమానాలు
గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కడప జిల్లా పులివెందులలోని తన సొంత నివాసంలో జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ముందుగా వివేకాకు గుండెపోటు వచ్చిందని చెప్పిన వైఎస్ కుటుంబీకులు ఆ తర్వాత ఆయన బాత్రూంలో కాలుజారి పడి ఉండొచ్చని మరో వాదన తెరపైకి తెచ్చారు. చివరికి అది హత్యగా తేలడంతో ఈ కేసును పక్కదారి పట్టించేందుకు జగన్ సోదరుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు ఎందుకు ప్రయత్నించారన్న వాదన తెరపైకి వచ్చింది. దీనికి జగన్ కుటుంబం వద్ద ఎలాంటి సమాధానం లేదు.
వివేకా హత్య తర్వాత పరిణామాలు..
కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడిగా ఆయన బతికున్న సమయంలో అన్నీతానై వ్యవహరించిన వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందన్న అనుమానాలు తలెత్తాయి. అయితే ముందుగా ఈ హత్యను గుర్తించిన వైఎస్ సోదరుడి కుమారుడు అవినాష్ రెడ్డితో పాటు వివేకా డ్రైవర్ భిన్నవాదనలు వినిపించడంతో కేసులో అనుమానాలు బలపడ్డాయి. హత్య విషయం తెలిసి కుమార్తె, భార్య హైదరాబాద్ నుంచి వచ్చే సరికి అది హత్యగా తేలింది. దీంతో వారికి వైఎస్ కుటుంబ సభ్యుల పాత్రపైనే అనుమానాలు మిగిలిపోయాయి.
సీబీఐకి విచారణ డిమాండ్
వివేకానందరెడ్డి హత్య విషయంలో వైఎస్ కుటుంబీకుల వ్యవహారశైలితో వివేకా కుటుంబసభ్యుల్లో మొదలైన అనుమానాలు వారిని కలిచివేశాయి. అదే సమయంలో విపక్షంలో ఉన్న జగన్ వివేకా హత్యపై ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. దీంతో వివేకా కుటుంబ సభ్యులు అంతా జగన్ కు వదిలిపెట్టి వారి పనుల్లో మునిగిపోయారు. అయితే గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకా హత్యపై జగన్ సీరియస్ గా దృష్టిపెట్టలేదనే ఆరోపణలు వచ్చాయి. సీఎంగా బిజీగా ఉన్న జగన్ ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడంతో వివేకా కుటుంబ సభ్యుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దీంతో తొలుత వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఆ తర్వాత కుమార్తె సునీతారెడ్డి సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
సీబీఐ అవసరం లేదన్న జగన్
అప్పటికే వివేకా కేసును విచారిస్తున్న సిట్ ను వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే జగన్ సమూలంగా మార్చేశారు. కొత్త సిట్ ఏర్పాటుతో పాటు సీఐడీ దర్యాప్తు కూడా కొనసాగుతున్నందున సీబీఐ విచారణ అవసరం లేదంటూ జగన్ సర్కారు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో జగన్ వైఖరిపై వివేకా కుటుంబ సభ్యులు బహిరంగంగానే మాట్లాడటం మొదలుపెట్టారు. విపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన జగన్ అధికారం చేపట్టాక సీబీఐ అవసరం లేదని చెప్పడంపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లోపు సిట్ అధికారులు కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని టార్గెట్ చేయడంతో ఆయన కూడా సీబీఐ విచారణ పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యారు. దీంతో వివేకా కుటుంబ సభ్యులతో పాటు ఆది కూడా సీబీఐ విచారణ కోరినట్లయింది.
సీబీఐకి అప్పగించిన హైకోర్టు- భవిష్యత్ పరిణామాలు
వివేకా హత్య కేసుపై పిటిషన్లను విచారించిన హైకోర్టు చివరికి సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఈ కేసులో అంతర్ రాష్ట్ర హంతకుల పాత్ర కూడా ఉండొచ్చని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం జగన్ సీబీఐ విచారణ వ్యతిరేకించిన ఈ కేసును సీబీఐకే అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు జగన్ కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా తయారైంది. దీంతో ఈ కేసులో సీబీఐ విచారణకు జగన్ కుటుంబ సభ్యులు హాజరు కావాల్సిన పరిస్దితి నెలకొంది. అదే సమయంలో హత్యలో జగన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు సీబీఐ తేల్చే పక్షంలో వైసీపీ అధినేత కమ్ ముఖ్యమంత్రికి భారీ ఎదురుదెబ్బ తప్పదని చెప్పవచ్చు.